భువనగిరి కలెక్టరేట్, మే 20 : వైద్యాధికారులు తాము చేసిన ప్రమాణాలను గుర్తు చేసుకోవాలని, ప్రభుత్వ దవాఖానల్లో సిజేరియన్లను తగ్గించి, సాధారణ ప్రసవాలపై ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల వైద్యాధికారులు, గైనకాలజిస్టులు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు వెచ్చిస్తున్నదని వివరించారు. ఆపరేషన్ల సంఖ్యను నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించి, పుట్టిన ప్రతి బిడ్డకు గోల్డెన్ అవర్లో ముర్రుపాలు తాగించాలన్నారు.
స్వరాష్ట్రంలో అభివృద్ధిలో ముందడుగు..
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రలో 2 కోట్ల 59లోల మెట్రిక్ టన్నుల వరి పండిస్తున్నామని, ఉచిత విద్యుత్, పరిశుభ్రమైన తాగునీరును ప్రజలకు అందిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ అన్నారు. అదేవిధంగా ఫారెస్టు గ్రీన్ కవర్లో రాష్ట్రం ముందుందని, స్వచ్ఛ గ్రామాలుగా దేశంలో సంసద్ ఆదర్శ గ్రామయోజన కింద ఎం పికైన 10 గ్రామాలు తెలంగాణవేనని తెలిపారు. టాప్-20లో 19గ్రామాలు మనవేనని, అందులో మొదటి గ్రామం జిల్లాకు చెందినదేనని అన్నారు. ఆరోగ్యం విషయంలో కేరళ, తమిళనాడు తర్వాత మన రాష్ట్రం మూడో స్థానంలో ఉన్నదన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఆపరేషన్లపై అధికారుల నిఘా..
ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే ఆపరేషన్లపై జిల్లా వైద్యాధికారులు నిఘా ఉంచి ఆపరేషన్లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తప్పు చేస్తే మెడికల్ కౌన్సిల్కు నివేదికలు పంపాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సా ధారణ ప్రసవాలు చేస్తే రూ. 3వేల ప్రోత్సాహకాన్ని వైద్య సిబ్బందికి అందిస్తామని మంత్రి తెలిపారు. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఆపరేషన్లను పరిశీలించాలని కలెక్టర్కు సూచించారు. యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు పెంచాలని, ఆశ కార్యకర్తలు బీపీ, షుగర్ వంటి మందులను ఇళ్ల వద్దే అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్రెడ్డి, బండ నరేందర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్తివారీ, వైద్యాధికారులు అజయ్కుమార్, మల్లికార్జున్రావు, చిన్నానాయక్ ఉన్నారు.
మంత్రికి ఘనస్వాగతం
బీబీనగర్ : ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. వారి వెంట సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్ ఉన్నారు.
రామన్నపేట దవాఖానను 100 పడకల స్థాయికి పెంచాలని వినతి
రామన్నపేట, మే 20: రామన్నపేట ప్రభుత్వ దవాఖాన స్థాయిని 100 పడకలకు పెంచాలని, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును కోరినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శుక్రవారం యాదాద్రి జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని కలిసి రామన్నపేట దవాఖాన పరిస్థితిని వివరించారు. పాత తాలుకా అయిన రామన్నపేట దవాఖాన ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మండలాల ప్రజలకు వైద్య సేవలందిస్తుందన్నారు. దవాఖాన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానంలో నూతన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.