యాదాద్రి, డిసెంబర్ 21 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. అనంతరం నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీ సమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు జరిపించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. సుమారు 14వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.18,83,947 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి దంపతులు
స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవంలో ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, విశ్రాంత ఐపీఎస్ సత్యనారాయణరెడ్డి దంపతులు పాల్గొని తరించారు. అనంతరం స్వయంభువుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం ఇవ్వగా అధికారులు స్వామి వారి ప్రసాదం అందించారు.