విద్య, వైద్యానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం
స్థ్దానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు సాగాలి
ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మండలి
చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
డిప్యుటేషన్లను ప్రోత్సహించవద్దని తీర్మానం
అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నందున అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థ్దాయిలో సమస్యలు స్థ్దానిక సంస్థల ప్రజాప్రతినిధులకే తెలిసే అవకాశం ఉన్నందున వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని సూచించారు. జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు అధ్యక్షతన బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం మండలి చైర్మన్ గుత్తా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రామికుడిలా శ్రమిస్తూ అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తుతున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం కోసం వెచ్చిస్తున్న ప్రతి రూపాయీ సద్వినియోగం కావాలన్నారు. మన ఊరు-మన బడిలో ఎంపిక చేసిన పాఠశాలలను తీర్చిదిద్దాలని కోరారు. 317 జీఓ ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు జరిగినందున ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, డిప్యుటేషన్పై పంపించవద్దని, దాంతో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, వాటిని సక్రమంగా వినియోగించేందుకు అధికారులు స్థానిక ప్రజాప్రతినిథులను సమన్వయం చేసుకొని చిత్త శుద్ధితో పనిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు అధ్యక్షతన బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యా వైద్యం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నందున వాటిని సద్వినియోగం చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం శ్రామికుడిలా పని చేస్తూ.. అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దనే ఈ సారి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పినప్పటికీ నష్టాన్ని భరించి రాష్ట్రమే కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు-మనబడి కింద ప్రభుత్వం తొలి విడుతగా 50 శాతం పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.3500 కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. ఆయా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేలా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సబ్ సెంటర్ల అభివృద్ధి, ఐదు పీఏసీఎస్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. వైద్యశాఖ యంత్రాంగం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆస్పత్రుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున అధికారులు రైతులకు అవగాహన కల్గించి నీళ్లున్న వారు సాగు చేసుకునేలా చూడాలన్నారు. 317 జీఓ ప్రకారం ఉపాధ్యాయుల బదిలీలు జరిగినందున వాళ్లను డిప్యుటేషన్ మీద పంపవద్దని సూచించారు. దాని వల్ల మారు మూల ప్రాంతాల విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు.
విద్య, వైద్య శాఖ అధికారుల తీరుపై నిరసన
జడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్య, వైద్య శాఖల అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించటం లేదని, డిప్యుటేషన్ల పేరుతో డ్యూటీ చేయక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడే వారు ఉండేలా చూడాలన్నారు. విద్యాశాఖలో 350 మంది అదనంగా ఉన్నప్పటికీ అవసరం ఉన్నచోటుకు ఎందుకు పంపడం లేదని అధికారులను ప్రశ్నించారు. 317 జీఓ ప్రకారం జరిగిన బదిలీలు న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ డిప్యుటేషన్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ సారి మంచిగ పని చేసే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో మాత్రమే విద్యార్థుల సంఖ్య పెరిగిందని, లేని చోట పెరుగలేదని గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. డిప్యుటేషన్లు పూర్తి స్థాయిలో రద్దు చేయాలని ప్రజా ప్రతినిథులెవ్వరూ వీటిని ప్రోత్సహించవద్దని తీర్మానించారు. డబుల్ పోస్టులు రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం ఈ సారి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనకు శ్రీకారం చుట్టినందున పాఠశాలలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ, అధికారులు పాల్గొన్నారు.
పీహెచ్సీల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మూడు నెలలకు ఒక సారి ఎంపీపీల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించటంతో పాటు నిత్యం రోగులకు వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాహుల్ శర్మ ఆదేశించారు. దీనిపై వెంటనే వైద్య శాఖ సర్కులర్ జారీ చేయాన్నారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్మికులు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా, వైద్య శాఖల్లో డిప్యుటేషన్లు పూర్తిగా నిలిపి వేయాలని ఆదేశించారు.
సభ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించాలి
జడ్పీటీసీలు, ఎంపీపీలు జడ్పీ సమావేశం దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు సూచించారు. ప్రధానంగా విద్యా, వైద్యం, తాగునీటి విషయంలో వెంటనే స్పందించాలన్నారు. క్షేత్ర స్థాయిలోనే వాటిని పరిష్కరించే విధంగా జిల్లా అధికారులు కిందిస్థాయి అధికారులకు సూచనలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలి. జిల్లా అధికారుల నుంచి ఆశ వర్కర్ల వరకు నిత్యం పర్యవేక్షించాలి. రైతుబీమా కోసం ప్రభుత్వం ఎల్ఐసీకీ ముందే ప్రీమియం చెల్లించినప్పటికీ బాధిత కుటుంబాలకు సరైన సమయంలో బీమా అందడం లేదు. ఈ విషయమై వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేసి సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వం ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓని నియమించినందున వారు రైతులకు సలహాలు, సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
-బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభ సభ్యుడు
డిప్యుటేషన్ వ్యవస్థకు స్వస్తి చెప్పండి
పెద్దవూర, త్రిపురారం, నిడమనూరు పీహెచ్సీ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. కొత్త భవనాలు మంజూరుపై ప్రభుత్వానికి నివేదించి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ఒక్కో డాక్టర్కు రెండు మండలాల బాధ్యతలు అప్పగించటంతో వారు ఎక్కడా పని చేయకుండా సొంత పనులపై దృష్టి పెట్టారు. విద్యాశాఖలో కూడా ఇదే తంతు జరుగుతున్నది. ఈ రెండు శాఖల్లో డిప్యుటేషన్ వ్యవస్థకు స్వస్తి పలికి వైద్య శాఖలో నూతన వైద్యుల నియామాకానికి నోటిఫికేషన్ వేయాలి. జీపీ కార్మికుల ద్వారా పాఠశాలలను, టాయిలెట్లను రోజుకు మూడు సార్లు క్లీనింగ్ చేయించాలి.
–నోముల భగత్కుమార్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే
పీఎం కిసాన్ సాయం గోరంతే
రాష్ట్ర ప్రభుత్వం గుంట జాగ ఉన్న రైతుకు కూడా పెట్టుబడి సాయం అందిస్తుంటే పీఎం కిసాన్ పధకం కింద కేంద్ర ప్రభుత్వం గోరంత సాయం చేసి కొండంత చెప్పుకుంటున్నది. జిల్లాలో 6.08లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తుంటే.. కేంద్రం ఒక ఇంట్ల ఒక రైతుకే అదీను సగం మందికి కూడా ఇవ్వడం లేదు. మారు మూల మండలాల్లోని పీహెచ్సీల్లో వైద్యులు సమయపాలన పాటించాలి. ఒకే డాక్టర్కు రెండు పీహెచ్సీల బాధ్యతలు ఇవ్వడంతో ఏ ఒక్క కాడ కూడా డ్యూటీ చేయడం లేదు. డిప్యుటేషన్ పద్ధతులకు స్వస్తి చెప్పాలి.
–అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ