నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పరంగా అత్యధిక లబ్ధి పొందిన జిల్లాగా నల్లగొండ ముందంజలో ఉందన్నారు. పోరాట పటిమ కలిగిన నల్లగొండ బిడ్డలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగుతారని తెలిపారు.
గతంలో ఇంతటి దారుణ పరిస్థితులు దేశంలో ఎన్నడూ లేవని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం, వ్యవసాయం బాగు కోసం, ఉపాధి అవకాశాల కోసం ఏనాడూ మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు ఆలోచించడం లేదని విమర్శించారు. రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కేవలం మత విద్వేషాలకు ప్రాధాన్యతనిస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. దేశంలోని మత విచ్ఛిన్నకర శక్తులకు ఊతమిస్తూ ప్రపంచ దేశాల ముందూ దేశాన్ని తలదించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అనేక దేశాలు దేశంలోని మత వైషమ్యాలపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చాక ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణలో అన్ని మతాల ప్రజలు సామరస్యంగా జీవించేలా చర్యలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. ఇటువంటి సామరస్యపూర్వక వాతావరణం దేశమంతటా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని, అందుకే ఆయన నాయకత్వం పట్ల దేశ ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనే దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఏర్పడిందని, అలాంటి శక్తి ఉన్న నేతగా దేశ ప్రజలకు కేసీఆర్ కనిపిస్తున్నారని వివరించారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు గురైన తెలంగాణను రాష్ట సాధన అనంతరం అనతి కాలంలోనే గొప్ప సంకల్పంతో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్యా, ఉపాధి, ఆరోగ్య రంగా ల్లో అద్భుత ప్రగతిని సాధించారని, ఇలాంటి అభివృద్ధి దేశమంతటా జరుగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ దేశానికి సేవలు అందించేలా రాష్ట్ర ప్రజలంతా వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతారని ఆకాంక్షించారు.