నీలగిరి, జనవరి 8 : అధికారమే పరమావధిగా అనైతికంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. వీరికి ఎంఐఎం కూడా తోడైంది. బీఆర్ఎస్లో గెలిచిన కొందరు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరిస్తూ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేశారు. కుమ్మక్కు రాజకీయంతో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి (బీఆర్ఎస్)పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాసంపై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సిండగా ఐదు నిమిషాల ముందుగానే కాంగ్రెస్ క్యాంపునకు వెళ్లిన సభ్యులు మున్సిపల్ కౌన్సిల్ హాల్కు చేరుకున్నారు. తరువాత బీజేపీ సభ్యులు, ఎంఐఎం సభ్యులు, బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్మన్తోపాటు మరో నలుగురు సభ్యులు వేర్వేరుగా సమావేశానికి హాజరయ్యారు. దీంతో 11.30 నిమిషాలకు కౌన్సిల్ సమావేశం అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన జరిగింది. మొత్తం 48 మంది సభ్యులకుగానూ 47 మంది హాజరుకాగా బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాత్రం గైరాజరయ్యారు. మరో ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు (మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి) సమావేశానికి రాలేదు.
దాంతో మొత్తం 47 ఓట్లకు గానూ అవిశ్వాసానికి అనుకూలంగా 41, వ్యతిరేకంగా చైర్మన్ సైదిరెడ్డితోపాటు మారగోని భవాని, యామ కవితారాణి, అభిమన్యుశ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనువాస్ ఓటు వేశారు. ఫార్వర్డ్ బ్లాక్లోకి వెళ్లిన బీఆర్ఎస్ సభ్యుడు పిల్లి రామరాజు తటస్థంగా ఓటు వేశారు. కాంగ్రెస్కు చెందిన 19 మంది, బీజేపీకి చెందిన ఐదుగురు, ఒక స్వతంత్ర, ఒక ఎంఐఎం, 15 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు.
దీంతో ఎన్నికల అధికారి అవిశ్వాసం నెగ్గినట్లుగా ప్రకటించి నూతన చైర్మన్ ఎన్నికయ్యే వరకు ప్రస్తుతం ఉన్న వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ చైర్మన్గా వ్యవహరిస్తారని ప్రకటించారు. అవిశ్వాస ప్రక్రియ అంతా వీడియోగ్రఫీలో చిత్రీకరించి, సమావేశం వివరాలు రాష్ట్ర పురపాలక శాఖకు పంపించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నిర్ణయించిన తేదీలో చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ భారీ పోలీసు బందోబస్తు చేపట్టారు. చివరకు ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయి. వాస్తవంగా కాంగ్రెస్కు ఉన్న సంఖ్యా బలానికి అవిశ్వాస తీర్మానం నెగ్గడం అంత సులువు కాదన్నది ఆది నుంచి ఉన్న చర్చ. కానీ అంతకు ముందే బీజేపీ సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా మద్దతు తెలుపుతున్నట్లు లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నారు. అవసరమైతేనే చేతులు ఎత్తాలని అనుకున్నట్లు తెలిసింది. కానీ కౌన్సిల్ హాల్లో బహిరంగంగానే బీజేపీ సభ్యులు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రసాద్ మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇక ఎంఐఎం సభ్యురాలు కొమ్ము నాగలక్ష్మి సైతం చివరి నిమిషం కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్లో గెలుపొందిన కౌన్సిలర్లు 15 మంది ప్రలోభాలతో పార్టీ మారి అవిశ్వాస తీర్మానానికి జై కొట్టారు. దీంతో వీరి కుమ్మక్కు రాజకీయాలు పట్టణంలో హాట్ టాపిక్గా మారాయి. సభ్యుల అధికార దాహం, డబ్బు ప్రలోభాలు రాజకీయాలను మరింత భ్రష్టు పట్టిస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతున్నది.
నల్లగొండ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం విషయం లో బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసినట్లు నాకు ఫిర్యాదు చేశారు. విప్ జారీ చేసిన విధానం, విప్ లోని సభ్యులు ఓటింగ్లో ఎలా ప్రవర్తించారు అనే విషయాన్ని మూడు రోజుల్లో విచారణ చేసి ఎన్నికల కమిషన్కు నివేదిక సమర్పిస్తాం. అక్కడి నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారంగా వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటాం.
రాజకీయ వ్యవస్థలో అవినీతి, అక్రమాలు జరిగితే అవిశ్వాసం పెడతారు.. కానీ నల్లగొండలో మాత్రం అందుకు భిన్నంగా స్వార్థ రాజకీయాల కోసమే పెట్టారు. నేను చైర్మన్గా ఎన్నికైన నాలుగేండ్ల కాలంలో మంత్రులు, మాజీ ఎమ్మెల్యే సహకారంతో వందల కోట్ల నిధులు తెచ్చి నల్లగొండను అభివృద్ధి చేశాం. కొందరు కౌన్సిలర్లు అధికారం ఎక్కడ ఉంటే ఆ పార్టీలోకి పోయి రాజకీయాలను భ్రస్టు పట్టిస్తున్నారు. గతంలో కోమటిరెడ్డి ఓడిపోయినప్పుడు అప్పటి చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మిని దింపేందుకు వీలు ఉన్నా కూడా విలువలకు కట్టుబడి ఉన్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఇలాంటి రాజకీయాలు తగవు. కుట్రలు, కుతంత్రాలతో సొంత పార్టీకి అన్యాయం చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలి.