జిల్లా అంతటా వర్ష ప్రభావం
మూసీకి భారీగా వరద, గేట్ల ఎత్తివేత
డిండిలోనూ పెరుగుతున్న నీటిమట్టం
శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదల షురూ
నాగార్జునసాగర్లోనూ ఆశాజనకంగా నీటి లభ్యత
నల్లగొండ జిల్లాలో సగటున 9.2 మిల్లీమీటర్ల వర్షపాతం
యాదాద్రి జిల్లాలో 15.5 మిల్లీమీటర్లు
వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా సాగర్కు నీరు వచ్చి చేరనుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఇక సూర్యాపేట జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు సైతం త్వరలోనే గోదావరి జలాలు విడుదల కానున్నాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి మార్గదర్శనంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నది.
నల్లగొండ ప్రతినిధి, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటికే సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. జూన్లో భారీ వర్షాలు లేకపోయినా ప్రస్తుతం నాలుగైదు రోజులుగా మంచి వర్షాలే కురుస్తున్నాయి. ఈ నెలలోనే ఇప్పటివరకు మెజార్టీ మండలాల్లో అదనపు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. జూన్ ఒకటి నుంచి బుధవారం నాటికి నల్లగొండ జిల్లాలో సాధారణంగా 134.7మిల్లీమీటర్ల వర్షపాతం కురువాల్సి ఉన్నది. కానీ 255.9మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 90 శాతం అదనంగా కురిసింది. యాదాద్రి జిల్లాలోనూ 156.5మి.మీటర్ల సాధారణ వర్షపాతానికి గానూ 281.3మి.మీ కురిసింది. మొత్తంగా 80శాతం అదనపు వర్షపాతం నమోదైంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైనట్లే. కాగా సోమవారం నల్లగొండ జిల్లాలో 9.2 మిల్లీమీటర్లు, యాదాద్రి జిల్లాలో 15.5మి.మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఎంతోకొంత వర్షపాతం కనిపించింది. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా అనుములలో 25.2 మి.మీటర్లు కురవగా యాదాద్రి జిల్లాలో అత్యధికంగా రాజాపేట మండలంలో 21.6మి.మీటర్లు కురిసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా జిల్లాలో వర్షాల ప్రభావం తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మెట్ట ప్రాంత రైతులు సైతం ప్రస్తుతం వర్షాలు ఆగిపోతేనే పంటలకు మేలని భావిస్తున్నారు. లేదంటే పంట నీరుచిచ్చు పట్టి మొక్కలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరోవైపు నాన్ఆయకట్టు ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద వరినార్లు ఊపందుకుంటున్నాయి. ఈ వర్షాలతో పొలాలను తడపడం సులువుగా మారడంతో రైతులు బిజీగా మారారు. మంచి వర్షాలతో ప్రకృతి తోడ్పాటుకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతుండడంతో ఆశాజనకంగా సాగుతున్న వానకాలం సీజన్పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులకు జలకళ
జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు వరదతో జలకళను సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే మధ్యతరహా ప్రాజెక్టులైన మూసీ, డిండి, శాలిగౌరారం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కేతేపల్లి మండల పరిధిలో మూసీకి భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఐదు గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఏడు గంటల వరకు మూసీ ప్రాజెక్టులో 645 అడుగులకు గాను 638.50 అడుగుల నీటిమట్టం ఉన్నది. 1,371 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుండగా 5563 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. హిమాయత్సాగర్తో పాటు హైదరాబాద్లోని పలు రిజర్వాయర్ల గేట్లు ఎత్తడంతో ఆ నీరంతా మూసీకి చేరుకుంటున్నది. అప్రమత్తమైన అధికారులు ముందస్తుగానే ప్రాజెక్టును కొంతమేర ఖాళీ చేయాలని ఎక్కువ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 30వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందనుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూసీకి నవంబర్ వరకు కూడా వరద వచ్చే అవకాశం ఉండడంతో రెండు కార్లకు కూడా సాగునీటికి ఢోకా ఉండకపోవచ్చు.
నాగార్జునసాగర్లోనూ ఆశాజనకంగానే..
జిల్లాలో కీలకమైన నాగార్జునాసాగర్ ప్రాజెక్టులోనూ పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్లో 528.50 అడుగుల నీటిమట్టం ఉంది. గతేడాది ఈ సమయానికి ఇంచుమించు ఇంతే నీటిమట్టం ఉంది. ఈ నీటితో నారుమళ్లకు అవసరమైన నీటిని విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలకు ఇప్పటికే పలు దఫాలుగా వరద వస్తున్నది. జూరాల ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రానికి 16వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అంటే కొద్దిరోజుల్లోనే ఎగువ నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు కూడా వరద మొదలు కానుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మొదలైతే ఆ నీటితో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ నీరంతా సాగర్కు చేరుతుంది. కొన్నేళ్లుగా శ్రీశైలానికి ఏ మాత్రం వరద మొదలైనా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వస్తున్నారు. గతేడాది కూడా ప్రాజెక్టుకు నీటి రాక మొదలైన రోజు నుంచే ఆ నీటిని సాగర్కు తరలించి నిల్వ చేశారు. దీంతో గత రెండు మూడేండ్లుగా సమృద్ధిగా రెండు కార్లకు సాగునీరు అందుతుండడంతో పాటు ఈ సీజన్కు నారుమళ్లకు అవసరమైన నీటిని నిల్వ చేయగలిగారు. సాగర్ పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 165.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో లేదు. శ్రీశైలంతో పాటు సాగర్లోనూ నీటి వాటాను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని కొనసాగిస్తుండడంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇక పులిచింతల ప్రాజెక్టులోనూ 175అడుగుల నీటిమట్టానికి గానూ 166.79 అడుగుల నీటిమట్టం ఉన్నది. కాగా 8548 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది.
డిండికి 1000 క్యూసెక్కులు..
డిండి ప్రాజెక్టుకు కూడా ఈ సీజన్ ప్రారంభంలోనే వరద మొదలైంది. సోమవారం సాయంత్రానికి డిండికి ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తున్నది. డిండి పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులకు గాను 32 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది. వరద ఇలాగే కొనసాగితే అలుగు పోయడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే డిండి ప్రాజెక్టు నుంచి పంటలకు సాగునీటి విడుదల కొనసాగుతుంది. మరోవైపు శాలిగౌరారం ప్రాజెక్టు కూడా అలుగు పోస్తున్నది. దీంతో సోమవారం ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేశారు.
ఐదు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. కొద్ది రోజులుగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో నిలకడగా వస్తున్నది. సోమవారం 2,627.53 క్యూసెక్కుల కొనసాగింది. ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్టు 3, 4, 7, 8, 10 వ నంబరు గేట్లను ఒక్కో గేటును 2 అడుగులు ఎత్తి 5,622.49 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 53.53 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, 220 క్యూసెక్కుల నీరు సీపేజ్, లీకేజీల ద్వారా దిగువకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 639.05(3.00 టీఎంసీలు)అడుగులుగా ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.
రాజాపేటలో అత్యధికంగా 21.6 మిల్లీ మీటర్ల వర్షం
భువనగిరి కలెక్టరేట్, జూలై 11 : జిల్లాలో గత మూడ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలోని రాజాపేటలో అత్యధికంగా 21.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు బీబీనగర్లో 20.4మి,మీ, బొమ్మలరామారంలో 19.8మి.మీ, వలిగొండ, తుర్కపల్లి(ఎం) మండలాల్లో 18.6మి.మీ, భూదాన్పోచంపల్లిలో 18.2మి.మీ, గుండాల, ఆలేరులలో 16.4మి.మీ, మోత్కూరులో 14.4 మి.మీ, యాదగిరిగుట్టలో 14.2మి.మీ, భువనగిరిలో 13.2మి.మీ, సంస్థాన్నారాయణపురంలో 12.8 మి.మీ, ఆత్మకూర్(ఎం), రామన్నపేటలో 10.8 మి.మీ, చౌటుప్పల్లో 7మి.మీల చొప్పున వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 15.5మి.మీల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వాగులతో జలకళ
మోత్కూరు : వర్షానికి మోత్కూరు మండలంలోని బృందావన్ కాల్వ, బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పొడిచేడు -అమ్మనబోలు గ్రామాల మధ్యలోని మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. బిక్కేరు ప్రవహిస్తుండటంతో మండల పరిసర గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న బిక్కేరు వాగు
ఆత్మకూరు(ఎం) : 4రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో సోమవారం మండల కేంద్రంతో పాటు మొరిపిరాల కోరటికల్, పల్లెపహాడ్, రహీంఖాన్పేట గ్రామాల్లో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండల కేంద్రంలోని వీర్ల చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగుపోస్తున్నది.
వర్షాకాలంలో పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదాలు
నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యుత్ శాఖ
చౌటుప్పల్, జూలై11 : వర్షాకాలం వచ్చింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ కాలంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న విద్యుత్ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది. విద్యుత్ మోటర్లు, స్తంభాలు, కరెంట్ తీగలు ఉన్న చోట అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రమాదాల నివారణకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇవి పాటించండి..
అధికారులు అందుబాటులో ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
భువనగిరి అర్బన్, జూలై 11: భారీ వర్ష సూచన కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్లో వర్షాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హాజరై అనంతరం మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని ప్రజలకు సూచించారు. చెరువులు, కుంటలు, నాళాల్లో పెరుగుతున్న నీటిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజవర్గంలోని అలుగు పోస్తున్న చెరువులు, కుంటల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులతో సమన్వయమవుతూ ఎలాంటి నష్టం వాటిల్లినా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్కు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, పశువులను అటువైపు వెళ్ల నీయొద్దని చెప్పారు.
జీవాలకు ఎఫెక్ట్
జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న
వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాసరావు
నల్లగొండ, జులై 11 : వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున పశు పక్షాదులకు ప్రమాదం పొంచి ఉంటుందని, వాటిని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస రావు సూచిస్తున్నారు.