సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 24 : తరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు అవి. కాగా పట్టా పాస్ పుస్తకాలు లేకపోవడంతో ఒకవైపు ఆక్రమణదారులుగా పేరుమోస్తూ మరోవైపు ప్రభుత్వం అందించే పథకాలు దక్కక ఇబ్బందులు పడుతున్న వైనం. ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వాలెన్ని మారినా తమ గోడును పట్టించుకున్న నాథుడే లేడని గిరిజనులు వాపోయేవారు. అయితే ఏండ్ల నాటి నిరీక్షణకు తెరదించేలా తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవడంతో గిరిజనులు, గిరిజనేతరుల్లో కొత్త ఆశలు చిగురించాయి. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి భూముల సర్వేకు ఆదేశించడమే కాకుండా ప్రక్రియను వేగవంతం చేయండంతో సర్వత్రా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో పోడు భూములకు మోక్షం లభించి త్వరలోనే పట్టాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ ఏరియాలో వారం రోజులుగా అటవీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా పోడు భూముల సర్వే చేపడుతున్నారు.
తరతరాలుగా సాగు చేసుకుంటున్నాం
తాతల కాలం నుంచి భూములను సాగు చేసుకుంటున్నాం. పట్టా పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఫారెస్ట్ అధికారులు మా భూములను సాగు చేసుకోనివ్వడం లేదు. కంచె ఏర్పాటు చేసి వ్యవసాయ యంత్రాలను తీసుకెళ్లి కేసులు నమోదు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్ పోడు భూములపై సర్వే చేస్తుండడంతో త్వరలోనే మాకు కొత్త పట్టా పుస్తకాలు వస్తాయని నమ్మకం కలుగుతుంది. సీఎం కేసీఆర్ సార్కు గిరిజన తండాల ప్రజలందరం జీవితాంతం రుణపడి ఉంటాం.
– కొర్ర దేవా, ఐదు దోనాలతండా
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
గిరిజన రైతులకు, ఫారెస్ట్ అధికారులకు తరుచు గొడవలు జరుగుతుండేవి. పోడు సమస్యలకు పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవడంతో ఎన్నో ఏండ్ల నిరీక్షణకు తెర పడింది. ఇంకా చాలా మంది రైతులు దరఖాస్తు చేసుకోలేదు. వారికి కూడా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– పాండురంగానాయక్, సర్పంచ్,వెంకంబావితండా
1,729 మంది రైతులు..5,483 ఎకరాలకు దరఖాస్తు
మండలంలో గిరిజనులు, గిరిజనేతరులు నివాసముండే ప్రాంతాల్లో పోడు భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. మండలంలోని 7 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో 1,729 మంది రైతులు 5,483 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారు. వెంకాంబావితండాలో 142 మంది 356.02 ఎకరాలకు అలాగే కడిలబావింతండాలో 283 మంది 872.15 ఎకరాలు, ఐదు దోనాలతండాలో 527 మంది 1,874.22 ఎకరాలు, పల్లగట్టుతండాలో 144 మంది 438.62 ఎకరాలు, పోర్లగడ్డతండాలో 63 మంది 175.3 ఎకరాలు, రాచకొండలో 259 మంది 544.67 ఎకరాలు, తుంబావితండాలో 377 మంది 1,224.45 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారు. అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు 15 టీమ్లుగా ఏర్పడి మండలంలో క్షేత్రస్థాయికి వెళ్లి సాగులో ఉన్న భూములను సర్వే చేస్తున్నారు. ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారో ఆరా తీస్తూ ఆధారాలను సేకరిస్తున్నారు. జీపీఎస్ సర్వే నిర్వహించి, ఎంత మేర కబ్జాలో ఉన్నారన్న వివరాలను నమోదు చేస్తున్నారు. మండలంలో అటవీ, రెవెన్యూ మధ్య వివాదం ఉన్న భూముల సర్వే ఆలస్యం అయ్యేలా ఉన్నది. ప్రస్తుతం ఎలాంటి గొడవలు, వివాదాలు లేని సాగులో ఉన్న భూములను గుర్తిస్తున్నారు. గతంలో ఇచ్చిన పాస్ బుక్కులను పరిశీలించి సర్వే చేస్తున్నారు.