మోదీ సర్కారుపై మండిపడుతున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పిల్లలను చదివించేదెలా అని పేద, మధ్యతరగతి ఆగ్రహం జీఎస్టీపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
పన్నుకేదీ కాదు అనర్హం అన్నట్టు అన్ని రంగాలనూ పిండేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా బడి పిల్లల చదువుపై భారం మోపింది. పెన్సిళ్లు, రబ్బర్ల దగ్గరి నుంచి పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే ప్రతి వస్తువుపైనా జీఎస్టీ విధించింది. విద్యను కాస్ట్లీ చేసి కార్పొరేట్లకు మేలు చేసేలా, పేదలను చదువుకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులు 5,32,325 మంది ఉండగా, కేంద్ర ప్రభుత్వం మోపిన జీఎస్టీతో తల్లిదండ్రులపై ఏటా రూ.250 కోట్ల అదనపు భారం పడనున్నది. ఇలా అయితే పిల్లలను చదివించేది ఎలా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యా సామగ్రిపై జీఎస్టీ వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జీఎస్టీ భారంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారమూ ఆందోళనలు కొనసాగాయి. టీఆర్ఎస్ ముందుండి కార్యక్రమాలు చేపట్టగా, మోదీ సర్కారు పన్నులతో అల్లాడుతున్న అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యారు. ఎక్కడికక్కడ ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.
విద్య మన ప్రాథమిక హక్కు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే విద్యను సేవారంగంగా గుర్తించారు. ప్రతి ఒక్కరికీ విద్య తప్పనిసరి చేస్తూ గత ప్రభుత్వం నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. కానీ వీటన్నింటికీ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుచింది. విద్యకు వినియోగించే వాటిపై కూడా జీఎస్టీ విధిస్తూ వస్తోంది. పెన్ను, పెన్సిళ్లతో మొదలు పుస్తకాలు ఇలా అన్నింటిపై పన్ను విధించి వాటిని పేదలకు అందకుండా చేస్తున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటిపై పన్నుల భారం మోపుతూ వస్తోంది. గతంలో కనీసం పైసా పన్ను లేని వస్తువులపైనా జీఎస్టీ పిడుగు మోపుతున్నది. చరిత్రలోనే తొలిసారి విద్యకు సంబంధించి వస్తువులపై పన్నుపోటు విధించింది. దేశంలో తొలిసారిగా ఇంక్, షార్ప్నర్, పెన్సిల్పై జీఎస్టీ విధించింది. దీంతో పాటు రైటింగ్, డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్స్, పేపర్పై కూడా ఏకంగా 12 శాతం జీఎస్టీ వేసింది.
పుస్తకాలపై 18 శాతం మోత
విద్యారంగానికి సంబంధించిన మరికొన్నింటిపైనా భారీగా జీఎస్టీ మోత మోగించింది. ఇప్పటి వరకు కొన్ని వస్తువులపై అతి స్వల్పంగా ట్యాక్స్ ఉన్న వాటిపై కూడా పెద్ద మొత్తంలో పెంచేసింది. టెక్ట్స్బుక్స్, వర్క్ బుక్స్, నోట్బుక్స్తో పాటు బ్యాగులపై కూడా జీఎస్టీ విధించింది. ఇప్పటి వరకు వీటిపై 1.8 శాతం మాత్రమే జీఎస్టీ ఉండగా, ప్రస్తుతం ఏకంగా 18 శాతానికి పెంచి పేద ప్రజల నడ్డి విరిచింది. ఇప్పటికే యూనిఫామ్, షూస్పై కూడా జీఎస్టీ అమలు చేస్తోంది. దాంతో పాటు గ్రాఫ్ పేపర్లు, చార్ట్, మ్యాప్ పేపర్లపై కూడా 18 శాతం టాక్స్ వసులు చేస్తున్నది.
తల్లిదండ్రులపై అదనపు భారం
కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో ఇప్పటికే జనం అల్లాడిపోతున్నారు. వరుసగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో ఆర్థికంగా చితికి పోతున్నారు. ఇవి చాలదన్నట్లు ప్రస్తుతం చదువుపై కూడా భారం వేసింది. 12 నుంచి 18 శాతం వరకు పెరిగిన జీఎస్టీతో విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక భారం పడుతున్నది. కేంద్రం పెంచిన జీఎస్టీతో ప్రస్తుతం రూ.10గా ఉన్న పెన్ను ధర రూ.12కి పెరుగనున్నది. ప్రస్తుతం మార్కెట్లో రూ. 500కు దొరికే స్కూల్ బ్యాగ్ రూ.600 కానున్నది. పుస్తకాల బిల్లు ఇప్పటి వరకు వెయ్యి అయితే పెరిగిన ట్యాక్స్తో అదికాస్తా రూ. 1300కి పెరగనున్నది. ఇలా అన్ని వస్తువుల ధరలు పెరిగి ఒక్కో పేరెంట్పై రూ.2 నుంచి రూ. 5వేల దాకా అదనపు భారం పడనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,32,325 మంది విద్యార్థులు చదువుతున్నారు. యాదాద్రి భువనగిరిలో 1,40,321మంది, నల్లగొండలో 2,19,375మంది, సూర్యాపేటలో 172689 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ లెక్కను ఉమ్మడి జిల్లాలో పేరెంట్స్పై సంవత్సరానికి రూ. 250 కోట్ల భారం పడనున్నది.
పేదలను చదువుకు దూరం చేసే కుట్ర
విద్యారంగంపై జీఎస్టీ విధించడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి పేదలపై పన్నులు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనాతో కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికి పోయి ఉండగా .. ఆదుకోవాల్సింది పోయి జీఎస్టీ పేరుతో దండుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగాన్ని పిరం చేసి.. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చదువును దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడుతున్నారు. వెంటనే జీఎస్టీని ఎత్తేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే బీజేపీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
విద్యా వస్తువులపై ఎందుకింత జీఎస్టీ
విద్యా వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడం సరికాదు. ప్రైవేటు కళాశాలల్లో కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న వారిపై కూడా అదనపు భారం పడుతున్నది. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో పేదలు చదువుకు దూరం కావాల్సి వస్తున్నది. వెంటనే విద్యా వస్తువులపై విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో విద్యార్థులు ఉద్యమించడం ఖాయం.
-బోయిని మధు, విద్యార్థి, భువనగిరి
పేద విద్యార్థులపై ఆర్థిక భారం
కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీతో పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతున్నది. విద్యార్థులు వినియోగించే పెన్సిల్, ఇంకు, షార్ప్నర్, రైటింగ్, డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్స్, పేపర్లపై 12 శాతం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, గ్రాఫ్ పేపర్లు, వర్క్బుక్స్పై 18 శాతం జీఎస్టీ విధించడంతో అవన్నీ పిరమైతవి. కేంద్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు నిధులిచ్చి అభివృద్ధి చేయకుండా విద్యార్థుల చదువులపై భారం వేయడం సరికాదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో విద్యార్థులు చదువుకు దూరం అవుతారు. జీఎస్టీ రద్దు చేసి పేదలు చదువుకునేలా చూడాలి.
– వనం రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
జీఎస్టీని తొలగించాలి
కేంద్ర ప్రభుత్వం అన్నింటిపై జీఎస్టీ వేస్తే పేదలు ఎట్ల బతుకుతరు. చిన్నచిన్న వస్తువులపై కూడా జీఎస్టీ వేయడం వల్ల రెండు రూపాయలు ఉన్న వస్తువు ఇప్పుడు రూ.4 అయ్యింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం పేదలకు విద్యను దూరం చేసే కుట్ర చేస్తోంది. వెంటనే విద్యపై జీఎస్టీని ఎత్తేయాలి.
– గోపి మహంకాళి, పెంచికల్పహాడ్, భువనగిరి
విద్యారంగంపై అధిక భారం
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులను పెంచుతూ అన్నివర్గాలను ఇబ్బంది పెడుతున్నది. చివరకు విద్య, దాని అనుబంధ రంగాల వస్తువులను కూడా వదలడం లేదు. విద్యార్థులు వాడే పెన్సిళ్లు, పేపర్లు, పుస్తకాలు, ప్రాక్టికల్స్కు అవసరమైన వస్తువులపై కూడా జీఎస్టీ విధించడం హేయమైన చర్య. చదువుకుంటున్న పేద విద్యార్థులపై భారం మోపడం బాధాకరం.
– సుర్కంటి శ్రీధర్రెడ్డి, విద్యావేత్త, మందోళ్లగూడెం, చౌటుప్పల్ రూరల్
నోటు పుస్తకాలపై జీఎస్టీ దారుణం
చదువుకోసం విద్యార్థులు వినియోగించే వస్తువులపై కూడా జీఎస్టీ విధించడం దారుణం. విద్యార్థులపై పన్నుపోటు సమంజసం కాదు. ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్, ఇంక్, పెన్సిల్, షార్ప్నర్స్, మ్యాప్స్, చార్ట్స్ ఇలా అన్నింటిపైనా జీఎస్టీ వేసి పేదలు చదువుకోకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. వెంటనే జీఎస్టీ ఎత్తేయాలి. లేదంటే ప్రజాతిరుగుబాటు తప్పదు.
– గోపగాని ప్రసాద్, యాదగిరిగుట్ట మండలం
యాదాద్రి భువనగిరి 1,40,321
నల్లగొండ 2,19,375
సూర్యాపేట 1,72,689
మొత్తం 5,32,325