మాల్, ఏప్రిల్ 26 : జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ అవిర్భావ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అదేశాల మేరకు ప్రతి గ్రామంలో జెండా పండుగను జరుపుకోవాలన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రాంతీయ పార్టీ కేసీఆర్ నాయకత్వలో రాష్ర్టాన్ని సాధించిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలను కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, ఆ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్రావు, కొండల్నాయక్, పున్రెడ్డి సుమతీరెడ్డి, ఆదిరాల కృష్ణయ్య, ఎల్లంకి అశోక్, బాదెపల్లి పులిరాజు, ఎండీ ఖలీద్, అంజనేయులు, బీజే యాదవ్, కృష్ణయ్య, శ్రీను పాల్గొన్నారు.
తెలంగాణ కోసం తెగించిన యోధుడు కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి కేసీఆర్ చలించిపోయారు. తానొక్కడే ముందుకు సాగి ప్రజాబలాన్ని కూడగట్టి 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన గొప్పనేత కేసీఆర్. కరడు గట్టిన ఆంధ్రా పాలకుల మోసాలు, కుట్రలను ఎండగట్టి ప్రజా ఉద్యమాన్ని ఉవ్వెతున ఎగిసి పడేలా చేశారు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని
సాధించిన గొప్ప నాయకుడు.
– చెలిమెండ్ల పద్మయ్య, అవంతీపురం, మిర్యాలగూడ
చావునోట్లో తలపెట్టి రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు..
‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ చావు అంచుల దాకా వెళ్లి రాష్ర్టాన్ని సాధించారు. మన నీళ్లు, నిధులు మనకే దక్కేలా కేంద్రం మెడలు వంచి తెలంగాణను తీసుకొచ్చారు. ఏడేండ్లుగా శక్తి వంచన లేకుండా అభివృద్ధిని కొనసాగిస్తున్నారు. పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది.
– బోనగిరి బాబు, మఠంపల్లి
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు..
తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ అవిశ్రాంత పోరాటం చేసింది. స్వరాష్ట్రాన్ని సాధించుకోవడానికి పార్టీ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 14ఏండ్లు శ్రమించి ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించేలా అవగాహన కల్పించి, సబ్బండ వర్గాలను కలుపుకొని రాష్ట్రాన్ని సాధించారు. నీళ్లు, నియామకాలు నిధులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చారు. రైతు రాజు కావాలన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.
– మట్టపల్లి శ్రీనివాస్గౌడ్, పాలవరం, అనంతగిరి
కేసీఆర్ పిలుపందుకుని ఉద్యమంలోకి..
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పాల్గొన్నాను. రాస్తారోకో, రైల్రోకోలో పాల్గొని జైలు జీవితం గడిపాను. ఆ జ్ఞాపకాలను జీవిత కాలంలో మర్చిపోలేం. కేసీఆర్ పిలుపందుకుని గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి ఎన్నో ఆందోళనలు చేశాం. కేసీఆర్ పట్టుదలతోనే రాష్ర్టాన్ని సాధించుకున్నాం. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి ఏరాష్ట్రంలో కూడా లేదు.
– సింగం రామ్మోహన్, నల్లగొండ