రామగిరి, ఫిబ్రవరి 3 : బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాట చార్జీలు అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.400, హైస్కూల్ విద్యార్థులకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు అందిస్తున్న సర్కారు.. అక్టోబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన విడుదల చేసింది. అవి త్వరలో విద్యార్థుల ఖాతాల్లో జమ కానున్నాయి. దాంతో ఉమ్మడి జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు యూ-డైస్లో నమోదైన 3,314 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రాథమిక పాఠశాల (1 నుంచి 5వ తరగతి), ప్రాథమికోన్నత, జడ్పీ హైస్కూల్లో (1 నుంచి 10వ తరగతి) చదివే విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి నెలకు రూ.400, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థికి రూ.600 చొప్పున అందిస్తున్నది. నల్లగొండ జిల్లాలో ఇప్పటి ఎమ్మార్సీల నుంచి ఆన్లైన్లో నమోదు చేసిన 1216 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందుతున్నది.
బస్సు సౌకర్యం లేకుండా పాఠశాలకు వచ్చే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించి యూ-డైస్లో ఆన్లైన్లో నమోదు చేశారు. ఆ విద్యార్థులకు రవాణా చార్జీలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మూడు నెలలకు సంబంధించిన నిధులు విడుదల చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్కు సంబంధించిన నిధులు త్వరలోనే విద్యార్థుల ఖాతాల్లో జమ కానున్నాయి.
నల్లగొండ జిల్లాలోని 28 మండలాల్లోని 1216 మంది విద్యార్థులు రవాణా భత్యం కోసం అర్హత సాధించారు. సూర్యాపేట జిల్లాలోని 19 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 945 మంది విద్యార్థులకు, యాదాద్రిభువనగిరి జిల్లాలోని 15 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 1153 మంది విద్యార్థులు రవాణా భత్యం కోసం అర్హత సాధించారు.
అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసే రవాణా భత్యం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ సూర్యాపేట జిల్లాలోని 19 మండలాల్లో 945 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి అక్విటెన్సీని విద్యాశాఖ సిద్ధం చేస్తున్నది.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట