ఆంగ్ల మాధ్యమం ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసింది. అన్ని పాఠశాలలు నూరు శాతం ఫలితాలతో వైభవాన్ని చాటుతున్నాయి. 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్… మొత్తం 7 పాఠశాలలున్న త్రిపురారం మండలంలో 2013లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద ‘డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్’ చేపట్టిన స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం సమూల మార్పులకు కేంద్రమైంది. 2014 నుంచి 2018 వరకు అన్ని పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. 10 శాతం మంది 10/10 జీపీఏ, 60 శాతం ‘ఏ’ గ్రేడ్, మిగిలిన 40 శాతం విద్యార్థులు ‘బి’ గ్రేడ్లో ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో ఒక మండలం మొత్తంలో నూరు శాతం ఉత్తీర్ణత, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో త్రిపురారం ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నది.
జడ్పీహెచ్ఎస్ త్రిపురారం, పెద్దదేవులపల్లి, చెన్నాయిపాలెం పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు, ఇంగ్లిష్ మీడియం కూడా బోధిస్తున్నారు. నీలాయిగూడెం, దుగ్గేపల్లిలోని ఉన్నత పాఠశాలలను పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చారు. కేజీబీవీ, టీఎస్ఎంఎస్లలో ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యం పెంచారు. 7 పాఠశాలల్లో సుమారు 2,500 గ్రంథాలయ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. 1700 మంది విద్యార్థులకు ఇంగ్లిష్ డిక్షనరీలు, వర్క్బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్, స్టడీ మెటీరియల్ అందించారు. ప్రతి పాఠశాలకూ ముగ్గురు ఆంగ్లంలో నైపుణ్యం కల్గిన అర్హులైన వలంటీర్లను(21 మందిని) నియమించి ఆంగ్ల, గణిత, సామాన్య శాస్త్రంలో వినూత్న బోధన పద్ధతులపై శిక్షణనిచ్చారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా గ్రూపులు చేసి ప్రత్యామ్నాయ తరగతులు నిర్వహించారు. చదువడం, రాయడం, సాధన చేయడంలో ఎక్కువగా ప్రాక్టీస్ చేయించారు. గ్రంథాలయ పుస్తకాలు, రోజూ ఒక పీరియడ్ చదివించడం వల్ల పఠన నైపుణ్యం పెరిగింది. గణితంపై వారానికి ఒక స్లిప్టెస్ట్ నిర్వహించారు. సైన్స్ పాఠ్యాంశాల బోధన కోసం ప్రత్యేకంగా మొబైల్ సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఆంగ్లంతో పాటు, ఇతర కఠిన అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆంగ్లమాధ్యమం తప్పసరి. అందుకే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో కార్పొరేట్కు దీటుగా తీర్చి దిద్దాం. ఇంగ్లిష్ మీడియంలో ఉత్తమ విద్యను అందిస్తున్నాం. చదువులో వెనుక బడిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు, దాతల సహకారంతో పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం.
– ఎంఈఓ బాలాజీనాయక్
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిని తీర్చి దిద్దుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన సదుపాయాలతో విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో విద్యనందిస్తున్నాం. కంప్యూటర్తో పాటు ఇంగ్లిష్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. దాంతో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం.
-లావూరి వెంకన్న, హెచ్ఎం, జడ్పీహెచ్ఎస్, చెన్నాయిపాలెం
ఏడు పాఠశాలల్లో 5 లక్షల విలువైన 5 ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షితమైన తాగునీరు అందిస్తున్నారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా 375 డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించారు. 7 పాఠశాలల్లో రంగులు వేయించి తరగతులు ఆహ్లాదకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. సైన్స్డే సందర్భంగా ప్రతి విద్యార్థి ఒక ప్రయోగం చేసి ప్రదర్శించే విధంగా చూడటం, తరచూ ఆంగ్లంలో మాట్లాడించడం మంచి ఫలితాలకు దోహదపడుతోంది. పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటారు. వాటికి నీళ్లు పోయడానికి ఒక మనిషిని నియమించారు. దాంతో ప్రస్తుతం అన్ని పాఠశాలలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. 2014 నుంచి 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సంవత్సరానికి రూ.15 వేల స్కాలర్షిప్ అందించారు. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సౌజన్యంతో స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద పాఠశాలల్లో భౌతిక వసతులు పెంచడంతో పాటు, ఆంగ్ల మాధ్యమంలో గ్రామీణ విద్యార్థులు విద్యనభ్యసించి పోటీ ప్రపంచంలో ప్రతిభను చాటే విధంగా గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు.