నల్లగొండ, జనవరి 31 : నల్లగొండ జిల్లాలో 2022-23 వానకాలంతోపాటు యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యం నల్లగొండ జిల్లాలో పూర్తి కాలేదు. జనవరి-31తో గడువు ముగిసినా వానకాలం సీజన్ది 99 శాతం, యాసంగి సీజన్ది 44శాతం మాత్రమే పూర్తి అయ్యింది. యాసంగి సీజన్ది ఇంకా 56శాతం మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్నది. 2022-23 వానకాలంలో మొత్తం 4,44,576 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇవ్వగా మిల్లింగ్ చేసి ఈ జనవరి-31 నాటికి 2,98,723 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి. గడువులోపు 2,97,634 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి పంపించగా ఇంకా 1,089 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉన్నది.
యాసంగి సీజన్కు సంబంధించి 6,91,801 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇవ్వగా 4,66 832 మెట్రిక్ టన్నుల బియ్యానికిగానూ ఇప్పటివరకు 2,04,914 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 2,61,918 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి పంపాల్సి ఉన్నది. ఈ యాసంగి బియ్యం సకాలంలో ఇవ్వలేదు కాబట్టి సేకరణకు మళ్లీ గడువు ఇవ్వాలా లేక టెండర్లు పెట్టి మిల్లర్లకే బియ్యం అమ్మాలా అనే కోణంలో సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా 2022-23 యాసంగి ధాన్యం మిల్లుల్లో లేదని, మళ్లీ ఈ యాసంగి ధాన్యం మార్కెట్లోకి వస్తే తప్ప సీఎంఆర్ ఎఫ్సీఐకి ఇచ్చే అవకాశమే లేదని తెలుస్తున్నది.
2022-23 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ సేకరణకు ప్రభుత్వం రెండు సార్లు గడువు ఇచ్చింది. తొలుత ఒకసారి, మళ్లీ ఈ జనవరి-31వరకు అవకాశం ఇచ్చింది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా ఇప్పటి వరకు టార్గెట్ చేరలేదు. మరోసారి అవకాశం ఇచ్చి గడువు పెంచాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరుతుండగా ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉన్నది. మరోసారి గడువు ఇవ్వని పక్షంలో టెండర్లు నిర్వహించి మిల్లర్లే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నది.
జిల్లా వ్యాప్తంగా 2022-23 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించి ఇంకా 2.62 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్లో ఉండగా 2023-24 వానకాలం సీజన్కు సంబంధించిన సీఎంఆర్ కూడా రావాల్సి ఉన్నది. గతేడాది రెండు సీజన్లది పెండింగ్లో ఉండగా ఈ ఏడాది వానకాలం సీఎంఆర్ సేకరణ ఎప్పుడైతుందనే ప్రశ్న మొదలైంది. అసలు 2022-23 యాసంగి ధాన్యం మిల్లుల్లో ఉందా లేదా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది డిసెంబర్ చివరలో పలు మిల్లుల్లో టాస్క్ఫోర్స్ యంత్రాంగం చేసిన తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి.
2023-24 వానకాలం సీజన్లో కొన్న ధాన్యాన్ని 2022-23యాసంగి ధాన్యంగా చూపించి అప్పటికప్పుడు బచాయించినట్లు సమాచారం. ఇప్పుడు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ పెట్టకుండా ప్రైవేట్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంటే 2022-23 యాసంగి సీఎంఆర్ పూర్తి కావాలంటే మళ్లీ ఈ యాసంగి ధాన్యం మార్కెట్కు వస్తే తప్ప అప్పటి వరకు ఇచ్చే అవకాశమే లేదని తెలుస్తున్నది. ప్రభుత్వం ఇచ్చే ధాన్యం ఎప్పడికప్పుడు మిల్లింగ్ చేసి ఇవ్వకుండా ఒక సీజన్ ధాన్యాన్ని మాత్రమే రొటేషన్ చేసి క్యాష్ చేసుకుంటున్నారనేది బహిరంగ విషయం. దీన్ని ఇటీవల జరిగిన తనిఖీల్లో అధికారులు గుర్తించినప్పటికీ పొలిటికల్ ఒత్తిడి కారణంగా ఏమీ చేయలేకపోతున్నట్లు సమాచారం.