గత ప్రభుత్వాల పాలనలో కాంట్రాక్టు అధ్యాపకులు చాలీచాలని వేతనాలతో అవస్థలు పడ్డారు. వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని నాటి నాయకులను వేడుకున్నా పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో వారి కష్టాలు దూరమయ్యాయి. గతంలోనే వారి జీతాలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచగా తాజాగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. దాంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో 365 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అధ్యాపకులు సీఎం కేసీఆర్కు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
– రామగిరి, ఏప్రిల్ 30
రామగిరి, ఏప్రిల్ 30 : రెండు దశాబ్దాల కాలంగా తమ సర్వీసు క్రమబద్ధీకరణకు ఎదురుచూస్తున్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెల్లడించిన శుభవార్తతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న 365 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలి కేబినెట్ సమావేశంలో కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ అంశం చర్చించి 2016 ఫిబ్రవరి 26న జీఓ నెం.16 అప్రూవల్ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ కొంత మంది కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో కలిసి కోర్టుకెళ్లి ప్రక్రియను ఆపివేయించారు. క్రమబద్ధీకరణ ఆలస్యం అవుతుండటంతో ప్రభుత్వం 2017 జూన్ 16న జీఓ 162 విడుదల చేసి రూ.18వేలు ఉన్న వేతనాన్ని రూ.37,100కు పెంచి బేసిక్ పే అమలు చేసింది. మరో వైపు జీఓ నెం.170తో ప్రభుత్వ కళాశాలల్లో శాంక్షన్ పోస్టులను మంజూరు చేసింది. ఆ తర్వాత సంవత్సరంలో 10నెలలు ఇచ్చే వేతనాలను 12నెలలు ఇచ్చేలా జీఓ నెం.222ను 2018 సెప్టెంబర్ 5న విడుదల చేశారు. నూతన పీఆర్సీ ప్రకారం జూనియర్ అధ్యాపకులకు జీఓ నెం.105 తీసుకొచ్చి ప్రతి నెలా రూ.54,220, డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలల అధ్యాపకులకు జీఓ నెం.104, 106తో రూ.58,850 అందజేశారు. క్రమబద్ధీకరణపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్న కేసు పరిష్కారం కావడంతో ప్రభుత్వం తాజాగా రెగ్యులర్ చేసింది.
ఉమ్మడి జిల్లాలో 365మందికి లబ్ధి
సర్కారు నిర్ణయంతో నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లోని 365మంది కాంట్రాక్టు అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 290 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు, 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత ఉన్న 15మందికి, 5 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని 60మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులర్ కానున్నారు.
కాంట్రాక్టు లెక్చరర్స్ రెగ్యులరైజేషన్పై హర్షం
నల్లగొండలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
రామగిరి, ఏప్రిల్ 30 : ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నికల్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు మాట్లాడుతూ 23 సంవత్సరాల బానిస సంకెళ్లకు చరమ గీతం పాడుతూ తమ సర్వీసు రెగ్యులర్ చేస్తూ జీఓ విడుదల చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు మాలె వెంకట్రెడ్డి, వెంకటాద్రి కొండల్, పోలగాని శ్రీనివాస్, చింతమళ్ల మురళి, ఎండీ ఖాదర్, దేవమణి, నరసింహారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష దైవం సీఎం కేసీఆర్
కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను చూసి రెగ్యులరైజ్ చేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ మా పాలిట ప్రత్యక్ష దైవం. దేశంలో ఏ ప్రభుత్వమూ తీసుకోని సాహసోపేతమైన నిర్ణయంతో కుట్రలను తిప్పికొట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్పై ఉన్న కేసులను కొట్టేసే విధంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం కృషి చేసింది. మా జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేం. మంత్రి వర్గానికి, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఆదె మల్లేశం, పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు, ఎన్జీ కళాశాల, నల్లగొండ
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి నెరవేర్చారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తూ గత పాలకుల హయాంలో అరకొర వేతనాలతో పడిన మా కష్టాలను చూసి 12 నెలల వేతనాలను పెంచిన పీఆర్సీతో ఇప్పించారు. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసిన సీఎం కేసీఆర్ను జీవితంలో మరిచిపోలేను.
– వి.మధు, సివిల్ లెక్చరర్, పాలిటెక్నిక్ కళాశాల, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా
బానిస సంకెళ్లకు చరమ గీతం పాడిన మహానుభావుడు
23 సంవత్సరాల బానిస సంకెళ్లకు చరమ గీతం పాడుతూ క్రమబద్ధీకరణ జీఓ విడుదల చేసిన మనస్సున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో నిరుద్యోగులతో కేసులు వేయించి అడ్డుకున్నారు. ఆ కేసులను సైతం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కొట్టివేయించి ధర్మం వైపు న్యాయం ఉంటుందనే తరహాలో చివరికి అడ్డంకులను తొలగించి రెగ్యులైజేషన్ జీఓ విడుదల చేసిన ప్రత్యక్ష దైవం సీఎం కేసీఆర్. కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
– మాలె వెంకట్రెడ్డి, ఇంగ్లీష్ అధ్యాపకుడు, రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, యాదాద్రి భువనగిరి జిల్లా
మా జీవితాల్లో ఆనందం నింపిన మహోన్నత నేత
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మా సమస్యకు పరిష్కారం చూపిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మా జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత నేత. ప్రత్యేక జీఓలను విడుదల చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా వేతనాలు పెంచారు. కొంత మంది హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసినప్పటికీ వాటిని పరిష్కరించి రెగ్యులర్ చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హామీని నెరవేర్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– డి.దేవమణి, తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నల్లగొండ