పెద్దవూర, ఏప్రిల్ 5 : కొమురం భీం స్ఫూర్తితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకే అధికారం అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తండాల్లో శిశు విక్రయాలకు అడ్డుకట్ట వేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించేలా తీసుకొచ్చిన పథకమే కల్యాణలక్ష్మి అని మంత్రి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి భగత్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి సోమవారం పెద్దవూర మండలంలో మంత్రి పర్యటించారు. బోనూతల, కుంకుడు చెట్టు తండా, తూర్పుపూలగూడెం, చలకుర్తి, పడమటి పూలగూడెం, బెట్టెల తండా, నిమ్యానాయక్ తండా, పుల్యాతండా, మల్లెవానికుంట తండా, తంగెళ్ల తండా, పాల్తి తండాల్లో ప్రచారంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇస్తున్నదని గుర్తుచేస్తూ శిశు విక్రయాలకు అడ్డుకట్ట వేసిందని చెప్పారు. దవాఖానలో ప్రసవాలను ప్రోత్సహించేలా ‘కేసీఆర్ కిట్’ అందిస్తున్నదని తెలిపారు. అతి త్వరలో నెల్లికల్లు సహా ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేయడంతో పాటు డి 8,9 కాల్వలను పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీరందిస్తామని హామీ ఇచ్చారు. 14గ్రామాలకు నీరందించి రైతన్నల కాళ్లు కడుగుతామని చెప్పారు. గిరిజన తండాల్లో మహిళలు ఇబ్బంది పడకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. తండాల అభివృద్ధి, గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉప ఎన్నికల్లో నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
కాంగ్రెస్కు ఓటేస్తే వృథా : బాల్క సుమన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజనులను కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూశారే తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఉప ఎన్నికల మండల ఇన్చార్జి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. జానారెడ్డి 7సార్లు ఎమ్మెల్యేగా 4సార్లు మంత్రి పదవులను అనుభవించినా నియోజకవర్గానికి ఏ ఒక్కపనీ చేయలేదని విమర్శించారు. వయస్సులో ఉన్నప్పుడే పట్టించుకోని జానారెడ్డి వృద్ధాప్యంలో ఏం చేయగలరని ప్రశ్నించారు. అటు ఢిల్లీలో, ఇటు గల్లీలో అధికారంలో లేని పార్టీతో ఉపయోగం లేదని అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే వృథా.. కుక్కతోకను పట్టుకొని కృష్ణానదిని ఈదడమే అవుతుందని పేర్కొన్నారు.
సర్పంచ్ సహా పలువురు టీఆర్ఎస్లో చేరిక..
కుంకుడుచెట్టు తండా సర్పంచ్ రమావత్ ప్రియాంక, మరో 20మంది కాంగ్రెస్ నాయకులు, ఉట్లపల్లి గ్రామానికి చెందిన 25మంది బీజేపీ నాయకులు,చలకుర్తికి చెందిన మరో 50మంది కాంగ్రెస్ నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి మంత్రి జగదీశ్రెడ్డి, బాల్క సుమన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ చెన్ను అనూరాధా సుందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్రెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, కర్న బ్రహ్మారెడ్డి, ప్రవీణ్కుమార్, ఏనుగు రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్ పాలనలోనే వృత్తులకు పునరుజ్జీవం
మల్లన్నసాగర్ నుంచే నిజాంసాగర్కు