సంగారెడ్డి కాల్వ నుంచి తాత్కాలికమే
ప్రగతి నిరోధకుల వల్లే మల్లన్నసాగర్ ఆలస్యం
వచ్చే ఏడాదికి మల్లన్నసాగర్ నుంచే నీటి విడుదల
సిద్దిపేట, మార్చి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను ప్రస్తుతం సంగారెడ్డి కాల్వ నుంచి నిజాంసాగర్కు విడుదలచేస్తున్నప్పటికీ ఇది తాత్కాలికమే. కాళేశ్వరం పథకంలో అతి పెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ పనులు పూర్తికావడానికి మరి రెండుమూడు నెలలు పట్టే అవకాశం ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగు.. తద్వారా నిజాంసాగర్కు నీరు తరలిస్తున్నారు. వాస్తవానికి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఇప్పటికే సిద్ధం కావలసి ఉంది. కానీ కొందరు ప్రగతి నిరోధకులు, ప్రతీఘాత శక్తుల కారణంగా.. కోర్టుకేసులు.. ఇతరత్రా కారణాలతో ఆలస్యమైంది.
మల్లన్నసాగర్ రిజర్వాయర్కు 5 ఓటీ స్లూయిస్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే కాల్వ. ఈ తూము వద్ద 4 గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టుకు (18,19 ప్యాకేజీలకు) నీటిని పంపిస్తారు. ఈ కాల్వ కెపాసిటీ 6 వేల కూసెక్కులు ఉంటుంది. ఇదే కాల్వ నుంచి హల్దీ వాగుకు నీటిని విడుదలచేస్తారు.
దీనిలో 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగుకు, మరో 3వేల కూసెక్కుల నీటిని సింగూరుకు పంపేలా కాల్వ నిర్మాణం చేపట్టారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి విడుదలయ్యే కాళేశ్వర జలాలు తూప్రాన్ మండలంలోని గుండిరెడ్డిపల్లి వద్ద హల్దీ వాగులో కలుస్తుంది. ఇక్కడ ఏర్పాటుచేసే రెండు గేట్ల ద్వారా సింగూరుకు, హల్దీ వాగుకు కాళేశ్వర జలాలు చేరుతాయి. హల్దీ వాగు నుంచి నిజాంసాగర్కు నీరు చేరుతుంది. మల్లన్న సాగర్ నుంచి హల్ద్దీవాగు వరకు 32.9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
ప్రస్తుతానికి సంగారెడ్డి కాల్వనుంచి..
కాళేశ్వర జలాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ (మిడ్మానేరు) నుంచి అన్నపూర్ణ, సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్కు వచ్చి చేరుతున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 8.2 టీఎంసీల జలాలున్నాయి. ఈ రిజర్వాయర్ బండ్ 1.5 కిలోమీటర్ వద్ద సంగారెడ్డి కెనాల్ హెడ్ రెగ్యులెటర్ను ఏర్పాటుచేశారు. సంగారెడ్డి కెనాల్ ద్వారా 6.25 కిలోమీటర్ వద్ద సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేస్తారు. ఇక్కడినుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి జలాలు చేరుతాయి.
అక్కడినుంచి వర్గల్ పెద్ద చెరువుకు.. ఆ తర్వాత శాకారం ధర్మాయి చెరువుకు, అక్కడి నుంచి అంబర్పేట ఖాన్ చెరువులోకి జలాలు తరలుతాయి. ఖాన్ చెరువు నుంచి హల్దీవాగులోకి చేరుతాయి. సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగుకు మధ్య 6 కిలోమీటర్లు ఉంటుంది. హల్దీవాగు నాచగిరి లక్ష్మీనర్సంహాస్వామి దేవస్థానం, తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరలో కలుస్తుంది.
ఈ మొత్తం దూరం 70 కిలోమీటర్లు ఉంటుంది.అక్కడినుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వర జలాలు పరుగులు పెట్టనున్నాయి. హల్ద్దీవాగుపై మొత్తం 32 చెక్డ్యాంలు ఉన్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి..
ఒక్క గ్రామానికి ఏడాదికి 3.37 కోట్లు
తపాస్పల్లికి మల్లన్నసాగర్ నీరు