బోరుబండ్ల యంత్రాలు బారులు తీరిన చోట.. ప్లాస్టిక్ బిందెల అంగళ్లు వెలసిన చోట.. గుక్కెడు తాగునీటికోసం గోసపడ్డ చోట.. నీటి బొట్టు కోసం భూమిని జల్లెడ పట్టిన చోట.. చూడచక్కని ఎర్రరేగడి నేలలు నెర్రెలు బారిన చోట.. ఇప్పుడు దృశ్యం తారుమారైంది. ఎగిసి వచ్చిన గోదావరి కొండపోచమ్మై కొలువుదీరింది. సుందర పర్యాటక ప్రదేశంగా మారింది. ఎర్రటి ఎండల్లో కూడవెల్లి, హల్దీ వాగులు కూడబలుక్కున్నట్టు పరుగులు తీస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు తాండవహేలలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. పడావు పడ్డ భూముల గొంతుల తడార్చేందుకు కాళేశ్వరం మహా ప్రాజెక్టు జలాలు.. నీరసించిన నిజాంసాగర్ గుండె నింపడానికి తరలివస్తున్నాయి. ఉపనది మంజీర గడప తొక్కి.. రోళ్లు పగిలే రోహిణిలో రైతన్నలతో నారుమళ్లు వేయించడానికి కొండపోచమ్మ నుంచి గంగమ్మ ఉప్పొంగుతున్నది. తెలంగాణ జల కంఠీరవుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గోదావరి ప్రస్థానాన్ని మరో మలుపు తిప్పబోతున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్నుంచి తరలి వచ్చిన జలాలు వర్గల్ సమీపంలోని అవుసులపల్లి వద్ద సంగారెడ్డి కాలువకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి హల్దీవాగులోకి చేరి.. 96 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా ప్రవహించి పదిరోజుల్లో నిజాంసాగర్ ఒడిలోకి చేరుకోనున్నాయి.
ఇది ఒక అత్యద్భుతమైన సన్నివేశం.. చరిత్రనే తిరగరాసే ఘట్టం.. ఇవ్వాళ సీఎం కేసీఆర్ నదికి కొత్త నడక నేర్పిన అపురూప ఘట్టం. ఇప్పటి వరకు చరిత్ర ఏం ఉంది? వర్షాకాలంలో హల్ద్దీవాగులో పడ్డ నీళ్లతో వాగు పొంగి ప్రవహించినప్పుడు నీళ్లు మంజీరాకు వెళ్లడం, అక్కడి నుంచి నిజాంసాగర్కు వెళ్లడం, అక్కడి నుంచి ఎస్సారెస్సీకి, గోదావరి నదిలోకి నీళ్లు వెళ్లడం నది పుట్టినప్పటి నుంచి జరుగుతున్నది.. ఇప్పుడు దీనికి పూర్తిగా రివర్స్గా గోదావరి నీళ్లను తెచ్చి ఒక సర్కిల్ లాగా తిప్పుతున్నాం. హల్దీ వాగు, మంజీర నది గుండా నిజాంసాగర్కు తీసుకెళ్తున్నాం. నదికే కొత్త నడక నేర్పిన ఒక గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్. –మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను హల్దీవాగులోకి సీఎం కేసీఆర్ విడుదలచేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావు వివరించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉంటుందని చెప్పారు. 10.30 గంటలకు వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేస్తారని తెలిపారు. 11.15 గంటలకు మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదలచేస్తారని వివరించారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారని వెల్లడించారు. ‘నేడు జరుపుకొనే కార్యక్రమం ఒక చారిత్రాత్మకం..గజ్వేల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. ఇది అత్యద్భుతంగా అతి గొప్పగా జరగాల్సిన కార్యక్రమం. లక్షల మంది రైతుల సమక్షంలో వేడుకగా జరుపుకోవాల్సిన ఘట్టాన్ని.. కరోనా కారణంగా సాదాసీదాగా జరుపుకొంటున్నాం’ అని మంత్రి హరీశ్రావు చెప్పారు.
కలా? నిజమా?
ఇది కలనా నిజమా అనే విధంగా.. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ద్వారా 100 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నదిని 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్కు తెచ్చుకున్నామని మంత్రి హరీశ్రావు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో మండుటెండల్లో హల్దీవాగు పరుగులెత్తడం అంటే ఒక అద్భుతమైన సన్నివేశమని పేర్కొన్నారు. రైతుల పంటలను కాపాడడానికి సీఎం కేసీఆర్ కేవలం నీటి విడుదల కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారని తెలిపారు. కొంతమంది రైతులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను మాత్రమే ఆహ్వానించామని, ప్రజలెవరూ అన్యథా భావించవద్దని విజ్ఞప్తిచేశారు. ప్రజలు పెద్ద ఎత్తున రావద్దని కోరారు. పబ్లిక్ మీటింగ్ ఏర్పాటుచేయడం లేదని మంత్రి హరీశ్రావు తెలిపారు. ముందుగా సంగారెడ్డి కెనాల్ నుంచి బంధం చెరువుకు నీటిని వదులుతామని పేర్కొన్నారు. అటునుంచి పెద్ద చెరువు, ధర్మాయి చెరువు, ఖాన్చెరువుకు నీళ్లు వెళ్తాయని.. ఖాన్ చెరువు నుంచి హల్దీ వాగులోకి నీరు చేరుకుంటుందని చెప్పారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నిజాంసాగర్ వరకు 96 కిలోమీటర్ల దూరం గోదావరి జలాలు వెళ్తాయని తెలిపారు.
చరిత్రనే తిరగరాసే ఘట్టం
‘ఇది ఒక అత్యద్భుతమైన సన్నివేశం.. చరిత్రనే తిరగరాసే ఘట్టం.. ఇవ్వాళ సీఎం కేసీఆర్ నదికి కొత్త నడక నేర్పిన అపురూప ఘట్టం’ అని మంత్రి హరీశ్రావు అన్నారు. ‘ఇప్పటి వరకు చరిత్ర ఏం ఉంది? వర్షాకాలంలో హల్ద్దీవాగులో పడ్డ నీళ్లతో వాగు పొంగి ప్రవహించినప్పుడు నీళ్లు మంజీరాకు వెళ్లడం, అక్కడి నుంచి నిజాంసాగర్కు వెళ్లడం, అక్కడి నుంచి ఎస్సారెస్సీకి, గోదావరి నదిలోకి నీళ్లు వెళ్లడం నది పుట్టినప్పటి నుంచి జరుగుతున్నది.. ఇప్పుడు దీనికి పూర్తిగా రివర్స్గా గోదావరి నీళ్లను తెచ్చి ఒక సర్కిల్ లాగా తిప్పుతున్నాం. హల్దీ వాగు, మంజీర నది గుండా నిజాంసాగర్కు తీసుకెళ్తున్నాం. నదికే కొత్త నడక నేర్పిన ఒక గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్. 618 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు రావడం అంటే సీఎం కేసీఆర్ జన్మచరితార్థమైంది. ఇంతకంటే గొప్ప అనుభూతి మరోటి ఉండదు’ అని మంత్రి హరీశ్ కొనియాడారు.
ఒకప్పుడు గజ్వేల్, దుబ్బాక ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు చూసేవారమని, యాసంగి పంట వచ్చిందంటే పదుల సంఖ్యలో బోరులు వేసి అప్పుల పాలయ్యేవారని గుర్తుచేశారు. ఇలాంటి ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి అద్భుతమైన పంటలు పండించుకోబోతున్నామన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో గోదావరి జలాల విడుదలతో 32 చెక్డ్యాంలు నిండనున్నాయని పేర్కొన్నారు. ఈ చెక్డ్యాంలలో 0.62 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని తెలిపారు. వచ్చే 8 నుంచి 10 రోజుల్లో హల్దీ వాగు, మంజీర నది నుంచి నిజాంసాగర్లోకి గోదావరి జలాలు వెళ్తాయని చెప్పారు. న్నారు. హల్దీ, మంజీర నుంచి నిజాంసాగర్లోకి గోదావరి జలాల విడుదలతో వేసవిలో 14,268 ఎకరాల్లోని వరి పంటను కాపాడుకోగలుగుతామని వెల్లడించారు. పంటను కాపాడేందుకు గోదావరి జలాలను విడుదల చేయనున్న సందర్భంలో రైతాంగం పక్షాన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్న మంత్రి హరీశ్రావు అన్నారు. భూసేకరణకు సహకరించి గోదావరి జలాలు గజ్వేల్కు వచ్చేందుకు సహకారం అందించిన రైతులకు మంత్రి హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు సీఎం గజ్వేల్ పర్యటన
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మంగళవారం సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డేవిస్, ఈఎన్సీ హరిరాంలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన జరుగుతుంది. 10.30 గంటలకు వర్గల్ మండలం అసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగు కాల్వలోకి గోదావరి జలాలను సీఎం కేసీఆర్ విడుదలచేస్తారు. 11.15 గంటలకు మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కాల్వలోకి గోదావరి జలాలను విడుదల చేస్తారు. ఉమ్మడి మెదక్, నిజమాబాద్ జిల్లా శాసనసభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. నీటి విడుదల సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గంగమ్మతల్లికి ప్రత్యేకపూజలు చేసేవిధంగా ఆయా గ్రామాల రైతులు స్థానికంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
నా పెండ్లయినప్పటి నుండి ఇనలే ఈ ముచ్చట..
మాది చౌదర్పల్లి నా పెండ్లయ్యి 65 ఏండ్లు అయితాంది. మోటర్లతో చెర్వులను నింపుతుర్రంటే.. నమ్మబుద్దయితలేదు. ఆనకాలంలో వరదలకు చెర్వులు నిండంగా సూసినాం. గానీ ఎండిపోయిన చెరువులకు కాలువలు తీసి చెర్వు నింపడం గమ్మత్తే! ముఖ్యమంత్రి సారు ఇన్నాండ్లు ఫించన్లు ఇచ్చి నాలాంటి వారసులు లేనోళ్లకు అండగా ఉన్నడు. ఇప్పుడు చెర్వులకు నీళ్లు నింపి ఊరందరికి దేవుడైండు.
-పోతగల్ల నర్సమ్మ, మహిళ, చౌదర్పల్లి (సిద్దిపేట జిల్లా)
కూలిన బోర్లల్లో నీళ్లూరుతాయి..
ఆలొగొళ్లు..ఇలొగళ్లు చెప్పుకుంటుండగా ఇన్న ..ముఖ్యమంత్రి సార్ ఇయ్యాల కాలువకు నీళ్లిడిస్తరట అని ! ఈ మాట వినగానే సంతోషం అనిపించింది. గుంటిపల్లి, వర్గల్ ఊర్ల నడుమ ఉన్న పెద్ద చెర్వుకు గోదారి నీళ్లొస్తున్నయంటే ఇంతకంటే మంచి ముచ్చట ఏముంది? మా వూర్లో అక్కడక్కడా ఏండ్ల కింద ఏసిన బోర్లు నీళ్లు పడక దుమ్మురేగినాయి. చెర్వు నిండితే పాత బావులకు, బోర్లకు నీళ్లొస్త్తయి పెద్ద సారు రుణం తీర్చుకోలేనిది.
-కొండ ముత్యాలు, రైతు, గుంటిపల్లి (సిద్దిపేట జిల్లా)
రైతుల కోసం మంచి చేస్తుండు
ఇన్నాండ్లు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి పనిచెయ్యలేదు. ఎక్కడో ఉన్న నదిల నీళ్లను ఈ ఊరికి తేవడమంటే ఆశామాషీకాదు. వర్గల్ పెద్ద చెరువు ఎప్పుడు చూసినా సర్కారు తుమ్మళ్లతో అడివిలా ఉండేది. ఎప్పుడో కాలం కలిసొస్తే తప్ప నీళ్లుండేవి కావు. అలాంటి చెరువు ఇప్పుడు వానకాలం, ఎండకాలం తేడా లేకుండా ఎప్పుడూ నీళ్లతోనే సూడొచ్చు. కరువులేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి సార్కు దండాలు.
-అమ్మంగారి కిష్టారెడ్డి, రైతు, వర్గల్ (సిద్దిపేట జిల్లా)
గొడ్డూ గోదకు ఢోకాలేదు..
ఇయ్యాల చౌర్పల్లి బంధం చెరువుకు నీళ్లొస్తయట! మొన్నటి ఆనకాలంలో పడిన ఆననీళ్లు దినదినానికి ఎండుకపోతున్న్నయి. గొడ్డుగోదకు తిప్పలైతదేమో అనుకుంటున్న. రందీ మొదలయ్యేలోపే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లా నీళ్లు నింపుతుండటంతో రెండు పంటలు పండుతయి. గొర్రె, గొడ్డూ, గోదలకు ఢోకా ఉండదు .
-చెలిమెల పోషయ్య, రైతు, చౌదర్పల్లి (సిద్దిపేట జిల్లా)
మరిన్ని వార్తలు చదవండి..
ఒక్క గ్రామానికి ఏడాదికి 3.37 కోట్లు
తపాస్పల్లికి మల్లన్నసాగర్ నీరు
మల్లన్నసాగర్ నుంచే నిజాంసాగర్కు