ఖలీల్వాడి, ఆగస్టు 3 : ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు భర్తతో పాటు అత్తను అంతమొందించేందుకు పథకం వేసింది. ఎస్సై సుస్మిత కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మొదక్పల్లిలో పొట్టోళ్ల భూమన్న తన భార్య సోని, తల్లి భూదేవితో కలిసి ఉంటున్నాడు. సోనీ ప్రియుడి మోజులో పడి తమ బంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని భావించి వారిని చంపాలని పథకం వేసింది. ఈ క్రమంలో శనివారం మీల్మేకర్ కూర వండిన సోనీ.. అందులో గడ్డి మందు కలిపింది. మధ్యాహ్నం భోజనం చేసిన భూదేవికి వాంతులు, విరేచనాలు అయ్యాయి.
భూమన్నకు కూరలో పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి తినడం ఆపేశాడు. అప్పటికే తల తిరుగుతుండడంతో భూమన్న, భూదేవిని నిజామాబాద్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ వ్యవహారంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు.. సోనీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై సుస్మిత తెలిపారు.