నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. నీళ్లు లేక, సరిపడా కరెంట్ రాక పంటలు ఎండిపోతుండడంతో తల్లడిల్లిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఎగువ నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు రాలేదు. దాంతో గత వానకాలంతోపాటు ప్రస్తుత యాసంగిలో కూడా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయలేదు. 1999-2004 మధ్య నాటి దుర్భర పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు హయాంలో సేద్యం చేద్దామంటే కాల్వ కింద సాగు నీరు వచ్చేది కాదు. బోర్ల కిందనైనా తిండి గింజలనైనా
పండించుకుందామంటే కరెంట్ ఉండేది కాదు. సాగర్ ఆయకట్టు రైతులు ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
– హాలియా, ఫిబ్రవరి 20
సాగర్ ఎడమ కాల్వ కింద యాసంగిలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గతేడాది యాసంగిలో లక్ష ఎకరాల్లో వరి సాగు చేస్తే ఈ ఏడాది 30 శాతానికి మించలేదు. బోరు బావుల కింద మాత్రమే రైతులు వరి వేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. బోర్లు వట్టిపోతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తామన్న 24గంటల కరెంట్ సక్రమంగా ఇవ్వకపోవడంతో బోరు బావుల కింద వరి పొలాలు ఎండిపోతున్నాయి. దాంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలాలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించడంతో రహదారులపై ధర్నాలు, రాస్తారోకో చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో 6 రోజుల పాటు నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేసింది. కానీ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్క చెరువును కూడా ఎడమ కాల్వ నీటితో నింపలేదు. దాంతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మూగజీవాలకు సైతం నీళ్లు దొరకని పరిస్థితి నెలకొన్నది.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గతేడాది యాసంగిలో 1,26,489 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సంవత్సరం యాసంగికి 76,323 ఎకరాలకు పడిపోయింది. కాల్వకు నీళ్లు రాకపోవడం, భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఎండతీవ్రతకు చేతికి వచ్చే పంట కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరోసారి ఎడమ కాల్వ పరిధిలోని మేజర్లకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.
ఈ ఏడాది సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడం వల్ల ఆయకట్టు బీడుబారింది. ఎండ తీవ్రతకు మడికట్లలో గడ్డిపోస కూడా లేదు. మూగజీవాలను మేపేందుకు గడ్డి, తాగేందుకు నీరు దొరకడం లేదు. ప్రభుత్వం ఎడమ కాల్వ నీటితో చెరువులను నింపితే రైతులతో మూగజీవాలకు మేలు జరుగుతుంది.
– పిల్లి సైదులు, ఇబ్రహీంపేట, అనుముల మండలం
నేను బోరు కింద మూడు ఎకరాల్లో వరిసాగు చేసిన. వ్యవసాయానికి ప్రభుత్వం 16 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. ఎండ తీవ్రతకు నీళ్లు అందక పొలం ఎండిపోతున్నది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తే కరెంట్ కోతల కారణంగా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేదు.
-నగిరి శ్రీనివాస్, రైతు, త్రిపురారం