కోదాడ/హుజూర్నగర్, ఫిబ్రవరి 12 : సాగర్ ఎడమ కాల్వ కింద పంటలను ఎండబెట్టి, కృష్ణా జలాల పంపిణీని కేంద్రానికి అప్పగించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు. కోదాడ, హుజూర్నగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఆయన వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ బీడు భూములను సస్యశ్యామలం చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంట భూములను బీడుగా మారుస్తుందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రం కాల్వల నుంచి సాగర్ నీరు విడుదల చేయాలన్నా, నిలిపివేయాలన్నా, విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాలని, ప్రజలు గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది అన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజలు గెలిపించినందుకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రైతులకు ఇచ్చిన బహుమానం ఇదేనా అని అపహాస్యం చేశారు. ఆయకట్టు రైతులు కాంగ్రెస్ తీరు పై ఆగ్రహంగా ఉన్నారని, రైతులకు నీరు ఇప్పించేందుకు ఉద్యమ నాయకుడు కేసీఆర్ నడుము బిగించారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ నుంచి సాగునీరు అందక మోతె, నడిగూడెం, మునగాల మండలాల్లో 5000 ఎకరాల పంట ఎండిపోయే స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగర్ నుంచి కూడా నీళ్లు రాక పంటల సాగు తగ్గుముఖం పట్టగా వేసిన పంటలు కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కట్టుబడి ఉండాలన్నారు. నల్లగొండ సభకు రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశాల్లో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు , కౌన్సిలర్ జక్కుల వీరయ్య, నాయకులు బెదవాడ శ్రవణ్, గోపాలకృష్ణ, బెల్లకొండ అమర్, కడియం వెంకట్ రెడ్డి, ప్రదీప్, బసవయ్య పాల్గొన్నారు.