వినాయక్నగర్, జూలై 27: అత్యసవర సమయాల్లో, ఆపద కాలంలో అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ‘డయల్ 100’ ఎన్నో సత్ఫలితాలను ఇస్తున్నది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న బాధితుల ప్రాణాలను కాపాడుతున్నది. శాంతిభద్రతలు కాపాడడంలో, అల్లర్లు, గొడవలు నియంత్రించడంలో సమర్థవంతంగా వ్యవహరిస్తున్నది. అయితే, ఎంతో కీలకమైన ‘పోలీసు ఎమర్జెన్సీ సిస్టమ్’కు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కొందరు ఆకతాయిలు చేస్తున్న కాల్స్ సిబ్బందికి తలనొప్పిగా మారాయి. 24 గంటల పాటు నిరంతరాయంగా పని చేసే డయల్ 100కు ఫోన్ చేసి వ్యక్తిగత సమస్యలు, ఇంటి గొడవలు చెబుతుండడం ఇబ్బందికరంగా మారింది.
హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు బాధితులకు కాల్ చేసి మాట్లాడు తారు. సమస్య ఏమిటని, ఏం జరిగిందని ఆరా తీసి, వెంటనే బాధితులు ఉన్న ప్రాంతానికి బయల్దేరుతారు. అయితే, ఈ మధ్య కాలంలో డయల్ 100కు వస్తున్న సమస్యలు విని పోలీసులు విసిగెత్తి పోతున్నారు. వ్యక్తిగత సమస్యలు, ఇంట్లో గొడవల గురించి చెబుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు.
ఇటీవల నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేశాడు. సమస్య ఏమిటని పోలీసులు అడిగితే తమ ఇంటి ముందున్న ప్లాస్టిక్ బకెట్ ఎవరో ఎత్తుకుపోయారని, తాము ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించడంతో పోలీసులు విస్తుపోయారు. అర్ధరాత్రి వేళ కాల్ చేసిన ఓ వ్యక్తి.. తన భార్య కాపురానికి రావడం లేదని చెప్పడంతో సిబ్బంది కంగుతిన్నారు. మరో పోలీసుస్టేషన్ పరిధిలో నివాసముండే ఓ వ్యక్తి తెల్లవారుజామున డయల్ 100కు కాల్ చేశాడు. ఏమైందని ఆరా తీస్తే తన భార్యతో గొడవ జరిగిందని, మీరు వెంటనే రావాలని చెప్పాడు. మరో వ్యక్తి అయితే అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి, తన దగ్గర ఉన్న మద్యం అయిపోయిందని, ఇప్పుడు మద్యం తెచ్చివ్వాలని చెప్పడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.
అత్యవసర సమయంలో బాధితులు, ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి, ఫిర్యాదు చేయడానికి ‘డయల్ 100’ ఎమర్జెన్సీ సేవలను పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా డయల్ 100కు కాల్ చేస్తే, నేరుగా హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్కు కనెక్ట్ అవుతుంది. అక్కడున్న ఆపరేటర్లు కాల్ చేసిన వ్యక్తి వివరాలు తెలుసుకుంటారు. బాధితుడి జిల్లాతో పాటు ఏ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నాడో ఆరా తీస్తారు. అనంతరం సదరు వ్యక్తి ఫోన్ నంబర్, ఇతర వివరాలను సంబంధిత ఠాణాకు కాల్ చేసి చెబుతారు. వెంటనే సదరు వ్యక్తి ఉన్న ప్రాంతానికి వెళ్లాలని సూచిస్తారు. దీంతో స్థానిక పోలీసులు ఆ వ్యక్తి ఫోన్కు కాల్ చేసి సమస్య ఏమిటో అడిగి, లోకేషన్ను తెలుసుకుని వీలైనంత వేగంగా అక్కడికి చేరుకుంటారు. ఇలా ‘డయల్ 100’కు వచ్చే ఫోన్లతో చాలా వరకూ నేరాలు నియంత్రించడం, గొడవలు ఆపి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే, రోడ్డు ప్రమాదం, ఇతర ఘటనలు జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయక చర్యలు అందిస్తారు.
అత్యవసర వేళ అండగా నిలిచే ‘డయల్ 100’ను కొందరు దుర్వినియోగం చేస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి వారితో ఎమర్జెన్సీ సమయంలో బాధితులకు సాయం అందకపోయే ప్రమాదమున్నదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆపద సమయంలో ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ టోల్ ఫ్రీ నంబర్ను కాల్ చేసి అనవసరమైన, వ్యక్తిగత సమస్యలపైనా ఫిర్యాదు చేయడం వల్ల అసలైన బాధితులకు తక్షణ సేవలు దూరమవుతాయని పేర్కొంటున్నారు. ఎమర్జెన్సీ పోలీసు సిస్టమ్ను దుర్వినియోగం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఆపదలో ఉన్న వారు, అత్యవస సేవలు అవసరమైన వారు మాత్రమే టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచిస్తున్నారు.