కట్టంగూర్, జనవరి 24 : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు కట్టుబడి ఉండడంతోపాటు జనం సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కట్టంగూర్లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, 14 సంవత్సరాలు ఉద్యమం చేసినా రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణ మొదటి సీఎంగా 10 సంవత్సరాలు భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి వినూత్నమైన సంక్షేమ పథకాలను అమలు చేసి సబ్బండ వర్గాలకు అందించారని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో సాగు, తాగునీరు, వైద్య, విద్య, విద్యుత్ రంగాల్లో ప్రగతి సాధించి కేంద్ర ప్రభుత్వ ద్వారా అవార్డులు పొందిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలు కలిగిన బలమైన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన హామీలను గడువు ప్రకారం పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో గానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేసే వరకూ పార్టీ పరంగా ప్రభుత్వాని నిలదీస్తామని చెప్పారు. ఇటీవల హైదరాబాద్లో జిల్లాకు చెందిన రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలు, కిందిస్థాయి నాయకుల అభిప్రాయాలను తీసుకొని ఓటమి మీద సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వారికి మరింత అండగా ఉండేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు పార్టీ నాయకుల సూచనలు తీసుకొని పార్టీ అధినేత కేసీఆర్కు విన్నవించినట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి మొదటి వారంలో అన్ని నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు, సమావేశాలకు కేసీఆర్, కేటీఆర్ను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజల పక్షాన నిలబడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ముందుంటామని, ఉమ్మడి జిల్లా కమిటీలను త్వరలో ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. సమావేశంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు జానీపాషా, బీఆర్ఎస్ నాయకులు రెడ్డిపల్లి మనోహర్ పాల్గొన్నారు.