కోదాడ, అక్టోబర్ 28 : సమైక్య పాలనలో అభివృద్ధికి నోచని కోదాడ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రత్యేక చొరవతో కోదాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టింది. ఒక వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమంతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకే అందుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకతీతంగా, నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు పథకాలు అందుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని మోతె, నడిగూడెం, మునగాల మండలాల్లో 18 వేల ఎకరాలకు పైగా కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమవుతున్నాయి. రూ.200 కోట్లతో ఆర్అండ్బీ గ్రామీణ రోడ్లకు మహర్దశ కలుగడంతోపాటు 31కోట్లతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇప్పటికే 1400 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరిట 61.69కోట్లు అందాయి. ఇక మిషన్ భగీరథ కింద నియోజకవర్గంలోని 118 గ్రామాలకు 493 కోట్లతో ఇంటింటికీ శుద్ధి చేసిన జలాలు అందిస్తున్నారు.
గత పాలకుల హయాంలో నాన్ ఆయకట్టు ప్రాంతమైన మోతె, నడిగూడెం మండలాల్లో వేల ఎకరాలు సాగునీరు లేక బీళ్లుగా మారాయి. కానీ, నేడు అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాననే హామీ సాకారమై కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు అందుతుండడంతో బీళ్లు కాస్తా పంటపొలాలుగా మారడంతో ఆయా మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రూ.80 కోట్లతో కోదాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 20 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్ల విస్తరణ, 5 కోట్లతో సింగిల్ హార్మ్ లైట్లతోపాటు శ్మశ్మాన వాటికలు, 60 కోట్లతో పచ్చదనం, 65 లక్షలతో ప్రకృతి వనాలు, డ్రైన్ల నిర్మాణం కోసం 4 కోట్లు, మురుగు కాల్వల నిర్మాణానికి 3.45 కోట్లు, మరో 3.11 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, 25.08 కోట్లతో వాటర్ ట్యాంక్లు, పైప్పులైన్లు, 3 కోట్లతో అనంతగిరి రోడ్డు, బాలాజీనగర్లో వైకుంఠధామాలు నిర్మించారు.
నియోజకవర్గంలో రూ.21 కోట్లతో 5 చెక్డ్యామ్ల నిర్మించారు. దాంతో 3 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. శాంతినగర్, పాలవరం, మోతె, గోండ్రియాల, కోదాడలో చెక్డ్యామ్ల నిర్మాణంతో అదనంగా సాగు పెరుగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా రూ.75 కోట్లతో 1,400 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. వీటితోపాటు మరో 1,400 ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కోదాడ టౌన్లో 520, రూరల్లో 508, చిలుకూరు 200, మునగాల 250, నడిగూడెం 150, మోతె మండలంలో 170 ఇండ్లను అందజేశారు.
నియోజకవర్గంలో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ దవాఖానల్లో నిరుపేదలకు వైద్యారోగ్య సేవలు అందుతున్నాయి. మునగాలలో నూతన ప్రభుత్వ దవాఖానకు 1.28 లక్షలు, 1.5 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 లక్షలతో రేపాల ప్రభుత్వ దవాఖాన నిర్మాణం, త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 18 లక్షలు, అనంతగిరి 15.02 లక్షలు, మోతె దవాఖానకు 18లక్షలు, చిలుకూరు ప్రభుత్వ దవాఖానాలో అంతర్గరోడ్లకు 5లక్షలు, వివిధ పథకాలకు 23 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని దవాఖాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మునగాల ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి 1.20కోట్లు మంజూరయ్యాయి. కోదాడలో నూతనంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేయటంతో నియోజకవర్గంలోని గుడిబండ గ్రామంలో వంద మంది దళితులకు రూ.పది కోట్లతో వివిధ యూనిట్లు ఏర్పాటుచేసుకొని ఆర్థిక పురోభివృద్ధి పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కింద లబ్ధిదారులకు 22 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేశారు.
నియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ, కల్లుగీత, చేనేత కార్మికులు మొత్తం కలిపి 44,142 మందికి నెలనెలా పింఛన్లు అందుతున్నాయి. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో 9,127, కోదాడ రూరల్లో 7,410, అనంతగిరి 6,010, చిలుకూరు 7,103, మోతె 9,585, మునగాల 8,433, నడిగూడెం 5,601 మందికి ప్రభుత్వం పింఛన్లను అందిస్తుంది. అలాగే నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు సీఎం సహాయ నిధి కింద 25 కోట్లను అందించింది.
నియోజకవర్గంలో 31 కోట్లతో పాఠశాలల్లో అదనపు తరగతుల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుదీకరణ, వంటశాలల ఏర్పాటు, ప్రహరీల నిర్మాణం జరిగింది. ఇందులో 6.4 కోట్లతో కోదాడ మండలంలో 20 పాఠశాలలు, 4.56 కోట్లతో అనంతగిరి మండలంలో 11 పాఠశాలలు, 3 కోట్లతో చిలుకూరు మండలంలో పది పాఠశాలలు, 3.35 కోట్లతో మునగాల మండలంలో 14 పాఠశాలలు, 2.27 కోట్లతో నడిగూడెం మండలంలో 12 పాఠశాలలు, 1.5 కోట్లతో మోతె మండలంలో 16 పాఠశాలలు అభివృద్ధికి నోచుకున్నాయి.
2014కు ముందు కోదాడ నియోజకవర్గం వ్యవసాయం, విద్య, వైద్య రంగాలతోపాటు ఇతర రంగాలు కూడా అభివృద్ధి చెందలేదు. సమైక్య పాలనలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప, అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేపట్టాం. కాళేశ్వరం జలాలతో మోతె, నడిగూడెం, మునగాలలో 18 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. చెరువులు జలకళ సంతరించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధుల మంజూరుతో అవి సమగ్రాభివృద్ధి చెందుతున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. కోదాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. మరోసారి నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
-బొల్లం మల్లయ్యయాదవ్, ఎమ్మెల్యే కోదాడ
నియోజకవర్గ వ్యాప్తంగా 118 గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంతో స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందిస్తున్నది. గతంలో పలు గ్రామాల్లో ఎండాకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకొని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి మంచినీటిని తెచ్చుకునే పరిస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంతో గ్రామాలకు పైపులైన్లు వేసి కృష్ణా నీటిని అందిస్తున్నారు. ఎస్డీఎఫ్ నిధులు 21 కోట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 26 కోట్లు లబ్ధిదారులకు అందాయి. ఎన్ఆర్ఈజీఎస్ కింద 31 కోట్లు, పల్లె ప్రకృతి వనాలకు 20 కోట్లు, డీఎంఎఫ్టీ కింద 7 కోట్లు, హరితహారం కింద మొక్కలు పెంచేందుకు 14.75 కోట్లు, పల్లె ప్రకృతి వనం కింద 5.30 కోట్లు, డంపింగ్ యార్డుల నిర్మాణానికి 2.90 కోట్లు. నియోజకవర్గంలో 3.52 కోట్లతో రైతువేదికలు నిర్మించారు.