‘మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద మోదీ సర్కారు ఒత్తిడి తెస్తున్నది. మాట విననందుకు రాష్ర్టానికి ఇవ్వాల్సిన 30వేల కోట్ల రూపాయలను అడ్డుకుంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సంక్షేమం ఊసేలేదు. ఎన్నికల వేళ మాయ మాటలతో ఊళ్లళ్లోకి వచ్చి ఊరేగాలని చూస్తున్న ఆ పార్టీల నేతలను ప్రజలు నిలదీయాలి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి ప్రసంగిస్తూ అసత్య ఆరోపణలు, అబద్ధాలు ప్రచారం చేస్తూ బీజేపీ పాలకులు తెలంగాణలో అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు.
భూపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాతే నల్లగొండ నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైందన్నారు. జిల్లాను నిండా ముంచినవాళ్లు, ఫ్లోరైడ్ భూతం పాలు చేసిన వాళ్లు వస్తే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని, 12కి 12 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు. మరోవైపు మిర్యాలగూడలో జరిగిన వేములపల్లి ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి పాల్గొన్నారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి మెట్టు శ్రీనివాస్, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ హాజరయ్యారు. అన్నిచోట్లా ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా సాగాయి. భారీ ర్యాలీలు, పటాకుల మోత, కోలాటాలతో పండుగ వాతావరణం కనిపించింది.
– తిప్పర్తి, మార్చి 26
తిప్పర్తి, మార్చి 26 : తెలంగాణ తరహా అభివృద్ధ్ది దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో 18 గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో జరిగిన విధంగా అభివృద్ధ్ది జరుగడం లేదన్నారు. అభివృద్ధిని ఓర్వలేకనే సీఎం కేసీఆర్ కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించి ఊర కుక్కలాగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మన లాంటి పథకాలు లేవని, కల్యాణ లక్ష్మి తెలవదని, రైతు బంధు లేదని, ఇలా అక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. నల్లగొండలో 20 యేండ్లుగా జరుగని అభివృద్ధి ప్రస్తుత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పాలనలో జరుగుతుందన్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు వచ్చాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ను మరింత పటిష్టం చేయాలన్నారు.
గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గురించి వివరించాలన్నారు. నల్లగొండలో ఐటీ హబ్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. నల్లగొండను నిండా ముంచిన వారు మళ్లీ వస్తున్నారని భూపాల్రెడ్డిని బద్నాం చేస్తున్నారన్నారు. మోదీ పెట్రోల్, గ్యాస్, డీజల్ ధరలు మాత్రం పెంచిందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల జేబులు నింపుతుంటే మోదీ మాత్రం జేబులు కత్తిరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ జెండాను మళ్లీ మూడో సారి ఎగురవేసుకొని రాష్ర్టాన్ని మరింతగా అభివృద్ధ్ది చేసుకుందామని కార్యకర్తలను కోరారు. అంతకు ముందు తిప్పర్తి ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ జెండాను ఎగురవేశారు.
20 ఏండ్లుగా జరుగని అభివృద్ధ్ది నాలుగేండ్లలోచేశా : కంచర్ల భూపాల్రెడ్డి
ప్రజలు తన మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలో నియోజకవర్గం ఇరవై యేండ్లుగా అభివృద్ధ్దికి నోచుకోలేదని, నాలుగేండ్లుగా ఎంతో అభివృద్ధి చేశానన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మామిడాల వద్ద పాలేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణ చేపట్టలేక పోయాడని, కాశివారిగూడెం వద్ద వంతెన నిర్మించ లేదని, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడన్నారు. బీఆర్ఎస్ పాలనలో మామిడాల వద్ద బ్రిడ్జి మంజూరు చేసినట్లు చెప్పారు.
సీఎం కేసీ ఆర్తోనే అన్ని గ్రామాల్లో లింక్, సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ కుమార్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ శ్యాంసుందర్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రొట్టెల రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వర్రావు, నాయకులు పంకజ్ యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, బొర్ర సుధాకర్, సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కందుల రేణుకాలక్ష్మయ్య ,రైతు సమితి జిల్లా సభ్యురాలు జ్యోతి, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నదని ఎమ్మెల్సీ, ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రం రాక ముందు తెలంగాణ తీవ్ర వివక్షకు గురైందని, రాష్ర్టం ఏర్పాటైన తొమ్మిదేండ్ల కాలంలో ఎంతో అభివృద్ధ్ది సాధించిందన్నారు. గతంలో నీళ్లు, కరంటులేక వ్యవసాయం చేయలేక వలసలు పోయిన రైతాంగం తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. మూడోసారి బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి సంక్షేమంలో మరింత ముందుకు పోవాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందన్నారు.