నల్లగొండ, నవంబర్ 18 : ఈ నెల 20న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆయన శనివారం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి నల్లగొండలో 1 నుంచి 48 వార్డులకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్ష్మి గార్డెన్స్, బీఆర్ఎస్ కార్యాలయం, ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్, ఎస్ఆర్ గార్డెన్స్, కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో వార్డుల వారీగా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ నల్లగొండకు రానున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త ప్రతి వార్డులో పర్యటించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని అన్నారు. ఎన్నో ఎండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండను సీఎం కేసీఆర్ సహకారంతో భూపాల్ రెడ్డి ఈ ఐదేండ్లలో చేసిన అభివృద్ధ్ది ప్రజలకు వివరించి సభకు తీసుకోని రావాలన్నారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ది మీ కండ్ల ముందు కనబడుతుందని నల్లగొండ పునర్నిర్మాణం కోసం ప్రజలంతా ఆలోచన చేసి ఇదే అభివృద్ధ్ది కొనసాగించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
గడిచిన రెండేళ్లలోనే నల్లగొండ పట్టణంలో జరుగుతున్న రూ.1,400 కోట్ల అభివృద్ధ్ది పనుల్లో కొన్నింటిని ప్రారంభం చేసుకోగా మరో రూ.750 కోట్ల అభివృద్ధిలు జరుగుతున్నాయని, వాటిని పూర్తి చేయడంతోపాటు మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ది చేసేందుకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధ్ది ప్రదాత సీఎం కేసీఆర్ నల్లగొండకు వస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త ప్రతి వార్డుల్లో నల్లగొండలో జరిగిన అభివృద్దిని చెప్పి సీఎం సభకు తీసుకోని రావాలని కోరారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టి ఐటీ హబ్, మెడికల్ కళాశాల, బత్తాయి మార్కెట్ తెస్తానని మోసం చేసి మళ్లీ మాయ మాటలు చెబుతున్న కోమటిరెడ్డి నిజ స్వరూపం ప్రజలకు వివరించాలన్నారు. కార్యకర్తలకు హిత బోధ చేశారు. డబ్బులతో ఓట్లను కోని గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నందున మరోసారి నల్లగొండలో కోమటిరెడ్డి గెలిస్తే పదవి అడ్డం పెట్టుకుని ఖాళీ జాగాలు లేకుండా కబ్జా చేస్తారని ఆరోపించారు. అభివృద్ధి ఇదే విదంగా కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను అవగాహన పరచాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సమావేశాల్లో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు బోనగిరి దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, సాధినేని జనార్దన్ రావు, మధుసూదన్ రెడ్డి, సుంకరి మల్లేశ్ గౌడ్, మామిడి పద్మ, కంచనపల్లి రవీందర్ రావు, కొండూరు సత్యనారాయణ పాల్గొన్నారు.