వేములపల్లి / మిర్యాలగూడ రూరల్, మార్చి 26 : ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అధ్యక్షతన మిర్యాలగూడ పట్టణంలో ఆదివారం నిర్వహించిన వేములపల్లి మండల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతు రాజు చేయడమే ప్రథమ కర్తవ్యంగా భావించారన్నారు. ఆ దృష్టితోనే రైతుబంధు, రైతు బీమా, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని తెలిపారు. దీంతో రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపయ్యిందన్నారు. కరువు తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు బాధపడకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 10జిల్లాలను 33జిల్లాలుగా విస్తరించి 33సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విషం కక్కుతుందని విమర్శించారు. దాని లో భాగంగానే ఆడకూతురు అని చూడకుండా ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ కేసు నమోదు చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశ ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, ఇది తట్టుకోలేకే బీజేపీ కుట్రలు పన్నుతున్నదని తెలిపారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితపై అక్రమంగా లిక్కర్ కేసు నమోదు చేయడం, గ్యాస్ ధరలు పెంచడంతో తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ చీపురు కట్టతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు. ఒక్క వేములపల్లి మండలంలోనే ఇప్పటివరకు రూ.315కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టినట్లు తెలిపారు. ఇతర పార్టీల వారు ఎన్నికల్లో ఓటు అడిగేటప్పుడు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను వారి ముందు ఉంచి మీ పార్టీ నుంచి ఏం చేశారని నిలదీయాలని కోరారు.
రుణం తీసుకున్న ప్రతి రైతుకు రెండు పర్యాయాలు రూ.2లక్షల రుణాలను మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. రూ.50వేల రుణం వరకు ఇప్పటికీ మాఫీ అయ్యిందని, నెల రోజుల్లో మిగిలిన రుణాన్ని మాఫీ చేస్తామని హామీనిచ్చారు. గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేశామని, ఇంకేమైనా మిగిలి ఉంటే తన దృష్టికి తెస్తే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అన్నభీమోజు నాగార్జునచారి, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన నల్లమోతు సిద్ధార్థ, జేఏసీ అధ్యక్షుడు మాలి ధర్మపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యూత్ పట్టణాధ్యక్షుడు సోహెబ్, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గత పాలకుల హయాంలో ప్రసవాలకు ఆస్పత్రికి వెళ్లాలంటేనే నానా తిప్పలు తప్పేవి కావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గర్భిణులను అమ్మ ఒడి వాహనంలో సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. ప్రసవించిన అనంతరం కేసీఆర్ కిట్ అందించడంతో పాటు, అదే వాహనంలో తిరిగి ఇంటి దగ్గర దింపుతున్నారు. బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం వందలాది గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. అర్హులందరికీ కల్యాణలక్ష్మి అందించి ఆదుకుంటున్నది. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధికి తోడ్పడుతున్నది. మూడోసారి సైతం బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం.
– వల్లమల్ల సైదమ్మ, మొల్కపట్ంన, వేములపల్లి
పేదల అభివృద్ధికి సంక్షేమ పథకాలు దోహదం
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయి. రైతు సంక్షేమంతో పాటు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ యాదవులకు గొర్రెల పంపిణీ, ముదిరాజ్లకు వాహనాలు, చేప పిల్లల పంపిణీ, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్, దళితబంధుతో కుటుంబానికి రూ.10లక్షలు అందించడం స్వయం ఉపాధికి తోడ్పడుతున్నది. సంక్షేమ పథకాల లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ తిరిగి బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయం.
– లొడంగి వెంకన్న, సల్కునూరు, వేములపల్లి