నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) :భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)లో ఎన్నికల జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తన మార్క్ వ్యూహంతో ఎన్నికల యుద్ధానికి తెరలేపారు. ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలకు ఒకేసారి.. అది కూడా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోసారి అభ్యర్థులుగా ప్రకటించడంతో ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరినైట్లెంది. ఇప్పటికీ జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులే లేని విచిత్ర పరిస్థితులను కాంగ్రెస్, బీజేపీ ఎదుర్కొంటుండడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులందరూ ఎన్నికలపై దృష్టి సారించి, అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ర్టాభివృద్ధిలో అధినేత, సీఎం కేసీఆర్ విజన్తోపాటు ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన అస్ర్తాలుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని కోణాల్లో విశ్లేషించి, అంచనాలు రూపొందించి, సర్వేల సారాంశాన్ని మదించి, పార్టీ శ్రేణుల మనోగతానికి అనుగుణంగానే సిట్టింగ్లనే గులాబీ గెలుపు గుర్రాలుగా భావిస్తూ అభ్యర్థులుగా ప్రకటించిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లోనూ సమరోత్సాహం కనిపిస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో మంగళవారం ప్రగతిభవన్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను కలిశారు. తమపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించిన అధినేత కేసీఆర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తప్పక విజయంతో తిరిగి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని స్థానాలపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధ అవుతున్నది. విపక్షాలకు అందనంత ఎత్తులో చాలా ముందుగానే తన ఎన్నికల వ్యూహాన్ని షురూ చేసింది. సోమవారం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ 12కు 12 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించి సమరానికి సై అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలే తిరిగి తమ అభ్యర్థులు.. ఇక కాచుకోండి అంటూ విపక్షాలకు సవాల్ విసిరారు. దీంతో జిల్లా అంతటా పార్టీ శ్రేణులు, అభిమానులు సంబురాల్లో మునిగితేలారు. పల్లె, పట్నం తేడా లేకుండా అధినేత నిర్ణయంపై తమ సమ్మతిని తెలుపుతూ పార్టీ శ్రేణులంతా స్వీట్లు పంచుకొని పటాకులు కాలుస్తూ డ్యాన్స్లు చేశారు. ఇదే ఉత్సాహంతో ఎన్నికల చివరి వరకూ పని చేస్తామంటూ ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో 12 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసి చరిత్రను సృష్టించింది. ఇదే చరిత్రను మరోసారి పునరావృతం చేస్తామని ఇప్పటికే మంత్రి జగదీశ్రెడ్డి ప్రకటించారు. ఆదివారం సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ 12కు 12 అసెంబ్లీ స్థానాలు గెలువబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని చెప్పినా, కుట్రలు చేసినా ప్రజలు వాళ్లను నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రచార అస్ర్తాలని చెప్పకనే చెప్పారు. ఇచ్చిన హామీలతోపాటు చెప్పనివి సైతం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని సీఎం తెలిపారు. సూర్యాపేట సభకు జనం భారీ ఎత్తున హాజరు కావడంతోపాటు సీఎం ప్రసంగం ఛలోక్తులు, పిట్ట కథలు, విపక్షాలపై పంచులతో ఆకట్టుకున్నది. ఈ సభ ప్రభావం ఉమ్మడి జిల్లా అంతటా కనిపిస్తున్నది. ఇదే సమయంలో మరుసటి రోజే పార్టీ అభ్యర్థుల ప్రకటన వెలువడడంతో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొన్నది.
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి, ఎమ్మెల్యేలు
జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ను కలిశారు. ముందుగా ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి జగదీశ్రెడ్డిని కలిసి సూర్యాపేట సభ సక్సెస్తోపాటు ఒకేసారి అభ్యర్థులందరి ప్రకటనపై అభినందనలు తెలిపారు. సాయంత్రం జగదీశ్రెడ్డి సారథ్యంలో ప్రగతి భవన్కు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒక్కొక్కరుగా పుష్పగుచ్ఛాలందించి కృతజ్ఞతలు తెలిపారు. తమపై మరోసారి నమ్మకాన్ని ఉంచి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపి, అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సీఎం కేసీఆర్తో జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో మరోసారి బీఆర్ఎస్దే గెలుపని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. త్వరలోనే పూర్తి స్థాయి ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని చెప్పినట్లు సమాచారం. తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయం సాధిం చి వస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా అధినేతకు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
విపక్షాలకు అభ్యర్థులు కరువు
ఎన్నికల షెడ్యూల్కు రెండు నెలల ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు నేటికీ అన్ని స్థానాలకు అభ్యర్థులే కనిపించడం లేదు. బీఆర్ఎస్లో ఒక్కో స్థానానికి ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నా.. అన్ని కోణాల్లో ఆలోచించి అధినేత నిర్ణయం ప్రకటించారు. కానీ.. విపక్ష పార్టీలు కొన్ని స్థానాల్లో అభ్యర్థుల కోసం వెతుకులాటలో ఉన్నారు. ఇప్పటికీ నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి, మునుగోడు, మిర్యాలగూడ, ఆలేరు వంటి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థుల కోసం గాలిస్తున్నది. ఇప్పటికే అక్కడ పార్టీలో ఉన్న వారితో బీఆర్ఎస్ను ఢీ కొట్టలేమన్న అంచనాతో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు. ప్రస్తుతం ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నది. తుది అభ్యర్థులను ప్రకటించాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఆగక తప్పేలా లేదు. ఇక బీజేపీది మరీ దారుణమైన పరిస్థితి. మునుగోడులో తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పోటీ చేస్తే ఆ ఒక్క స్థానం తప్ప.. జిల్లాలో ఎక్కడా ఆ పార్టీకి సరైన అభ్యర్థులే కనిపించడం లేదు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతల్లో కనీస ప్రభావం చూపే అభ్యర్థులే కరువయ్యారు. ఇలాంటి వారితో రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ రాష్ట్ర పెద్దల మాటలు విస్మయానికి గురిచేస్తున్నాయి. అన్ని స్థానాలకు సరైన అభ్యర్థులే లేని కాంగ్రెస్, బీజేపీలు ఏ రకంగా చూసినా ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ను ఢీకొట్టడం అసాధ్యమేనన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
సీఎం కేసీఆర్కు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల కృతజ్ఞతలు
ప్రగతి భవన్లోబీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ను మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు. టికెట్ కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి జగదీశ్రెడ్డి వెంట ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్కుమార్ తదితరులు ఉన్నారు.