చందంపేట, జూలై 20 : కాంగ్రెస్ హయాంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు చూశామని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ గురువారం చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదికలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలివి లేని కాంగ్రెస్ నాయకులు 3గంటల కరెంటు సరిపోతుందంటున్నారన్నారు. రైతులు ఆలోచించుకొని 3గంటల కరెంటు అందించే పార్టీ కావాలో.. 24 గంటలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని సూచించారు. 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.12వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. రాష్ట్రంలో 1,00,674 మంది రైతులకు రైతు బీమా అందించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు రైతు బంధు కింద 11 విడుతల్లో రూ.72వేల కోట్లు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. గతంలో బతుకుదెరువు కోసం తెలంగాణ వాళ్లు పక్క రాష్ర్టాలకు పోతే.. ఇవాళ ఇతర రాష్ర్టాల నుంచి వరి నాట్లు వేయడానికి ఇక్కడికి వలస వచ్చే పరిస్థితి ఉన్నదని తెలిపారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, కృష్ణా, గోదావరి జలాలు అందించడం ద్వారా సంవత్సరానికి రైతులు మూడు పంటలు పండిస్తున్నారని అన్నారు. విద్యుత్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, నాయకులు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, రమావత్ మోహన్కృష్ణ, గోసుల అనంతగిరి, కేతావత్ లక్ష్మణ్నాయక్, కేతావత్ శంకర్నాయక్, ముత్యాల రవి, జక్కుల మున్నయ్య, రవి, నాగార్జున్, అర్జున్సింగ్, కొండల్రెడ్డి, కృష్ణ, శ్రీశైలం, సైదులు, రైతులు పాల్గొన్నారు.