హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఇచ్చి చేతులుదులుపుకుంటున్నది. అది కూడా విడతల వారీగా అందిస్తున్నారని, నమ్మబలికి మోసం చేశారంటూ కాంగ్రెస్ సర్కార్పై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాకుగా చూపుతూ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి మొండిచెయ్యి చూపుతున్నదని అంగన్వాడీ యూనియన్ల నాయకులు మండిపడుతున్నారు. నాడు ఆర్థిక పరిస్థితి గురించి తెలియకుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. రిటైర్మెంట్ పొందినవారు సుమారు తొమ్మిది వేల మంది సిబ్బంది ఉండగా, ఇప్పటివరకు సగం మందికి కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలిస్తామని ఆశ జూపి, విరమణ వయస్సును కూడా తగ్గించి తమను నట్టేట ముంచారని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ (మినీ) యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే బెనిఫిట్స్ ఇవ్వడం.. అది కూడా విడతల వారీగా విడుదల చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయంపై అనేకసార్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, డైరెక్టర్ను కలిసి విన్నవించినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హామీ మేరకు సిబ్బందికి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వాలని, అదీ కూడా రిటైర్ అయిన నెలలోగా అందించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఊరుకొనే ప్రసక్తేలేదని, ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.