వలిగొండ, జూలై 19 : రైతుల ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రొద్దటూరులోని రైతు వేదికలో క్లష్టర్ పరిధిలోని ఐదు గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందన్న వ్యాఖ్యలు రైతులను అవమానించడమేనని, కరెంట్ విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు రైతులు గుణపాఠం చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
మూడు గంటల కరెంట్తో ఎంత పొలం పారుతుందో రేవంత్రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులను ఆగం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. సమైక్య పాలనలో కరెంట్ లేక పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా చితికిపోయారని, ఎరువుల కోసం క్యూలో నిలబడే పరిస్థితి ఉండేదని అన్నారు. 2014 నుంచి స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయానికి నాణ్యమైన కరెంట్, రైతుబంధు, రైతుబీమాతోపాటు రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అవస్థలు పడ్డ రైతులు నేడు కేసీఆర్ పాలనలో సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలిచి, మూడు గంటల కరెంట్ ఇస్తామన్న రేవంత్రెడ్డికి రైతులు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.