హాలియా, జూలై 18 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యవసాయంపై, రైతాంగ సమస్యలపై అవగాహన లేదని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. త్రిపురారం మండలంలోని త్రిపురారం, నీలాయిగూడెం, దుగ్గెపల్లి గ్రామాల్లోని రైతువేదికల్లో మంగళవారం నిర్వహించిన రైతు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రైతును రాజును చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతున్నదన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సహాయం అందిస్తుండడంతో వరి దిగుబడిలో 16వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి వచ్చిందని తెలిపారు. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉదయం 3 గంటలు, రాత్రి 4గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు అరిగోస తీశారన్నారు. చాలీచాలని విద్యుత్తో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మూడు పంటలు పండించుకునే విధంగా వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ పాలన కావాలో.. 3గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో నిర్ణయించుకోవాలని రైతులకు సూచించారు.
రైతు వ్యతిరేకి అయిన కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తే, ఇంటింటికీ తాగునీరు అందిస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పిన జానారెడ్డి నేడు ఆ మాట మరిచి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. జానారెడ్డి తనయుడు జయవీర్రెడ్డి ఐదేండ్లకోసారి వచ్చి వెళ్లే గంగిరెద్డులాంటివాడని ఎద్దేవా చేశారు. అనంతరం నీలయగూడెంలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.
ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఉన్నదని, పది సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ నాయకులు ఎవరికి వారే ముఖ్యమంత్రి అని ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి తానే ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. కార్యక్రమాల్లో నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, ఎంపీటీసీ అంబటి రాము, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నాయకులు తాటి సత్యపాల్, రాంచంద్రయ్య, కామర్ల జానయ్య, వెంకటేశ్వర్లు, అనంతరెడ్డి, శ్రీనివాస్యాదవ్, శ్రీనివాసరెడ్డి, వెంకటాచారి, రామలింగయ్య, శ్యాంసుందర్రెడ్డి, ధనలక్ష్మి, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.