గుర్రంపోడు, అక్టోబర్ 27: 70 ఏండ్లుగా వెనుకబడి ఉన్న నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక సీఎం కేసీఆర్ సారథ్యంలో రెండున్నరేండ్లలోనే అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో మరోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గడిచిన రెండున్నరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి సహకారంతో గుర్రంపోడు మండలంలో రూ. 54 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అన్ని రంగాల్లో వెనుక బాటుకు గురి చేసిందని.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని.. ప్రస్తుతం మ్యానిఫెస్టోలో ప్రకటించినవన్నీ రాబోయే రోజుల్లో అమలు చేస్తారన్నారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్తో పాటు రేషన్ కార్డు దారులందరికీ సన్న బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రైతుబంధు ద్వారా ఎకరానికి రూ. 10 వేలు ఇస్తుండగా దానిని రూ. 16 వేలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ భరోసా పేరుతో బీమా అందిస్తామని, దాంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పింఛన్ను కూడా పెంచనున్నట్లు చెప్పారు.
ఇదే విషయాన్ని ప్రజలు రేపటి నుంచి గ్రామాలకు చర్చ పెట్టాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన పదేండ్లలోనే సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారన్నారు. గతంలో కరెంటు కోతలు ఉండగా ఇప్పుడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ వచ్చిందని, కంటి వెలుగు ద్వారా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి అద్దాలు అందించారని, రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, ఉచిత విద్యుత్, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, గృహలక్ష్మి, మిషన్ భగీరథ ఇలా అనేక పథకాలు పేదలకోసం రూపొందించి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
మరి 64 ఏండ్లు రాష్ట్రన్ని పాలించిన కాంగ్రెస్ ఇలాంటి ఒక సంక్షేమ పథకమైనా అమలు చేసిందా ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు చర్చపెట్టాలన్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థుల గురించి కూడా చర్చ పెట్టాలన్నారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీరందరూ నిద్రపోకుండా ప్రజలను చైతన్య పర్చి కారు గుర్తుకు ఓటేసి గెలిపించేలా చూడాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఐదేండ్లు ప్రజల మధ్యే ఉంటూ ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన 600 మంది నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ప్రజాఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే నోముల భగత్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు గుర్రంపోడులో హడావిడి చేసి ప్రజలను మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ఎవరెన్ని అసత్యాలు ప్రచారం చేసినా బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. రైతులందరూ సీఎం కేసీఆర్ పక్షానే ఉన్నారన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో, ఆ పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో ఆ పార్టీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలన్నారు. నాగార్జున సాగర్లో ఎమ్మెల్యేగా నోముల భగత్ను గెలిపించి సీఎం
ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ మాట్లాడుతూ జానారెడ్డి 35 ఏండ్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలోని పేద విద్యార్థులు చదువుకునేందుకు ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడ తీసుకురాలేని, రెండున్నరేండ్లలోనే నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నెల్లికల్లు లిఫ్టును తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే నోముల భగత్దే అన్నారు. రైతుబంధు ఇచ్చిన సీఎం కేసీఆర్కు ఓటేస్తారా..రైతుబంధును నిలుపుదల చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అనేది ప్రజలే నిర్ణయించాలన్నారు.
రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు రాష్ర్టాన్ని అభివృద్దిపథంలో ముందుకు తీసుకుపోతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. కార్యకర్తలంతా ఐక్యంగా ఉండి నోముల భగత్ను గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కడారి అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
హాలియా : గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు పోటెత్తారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి 15 నుంచి 20 వేల మంది ప్రజలు తరలిరావడంతో మండల కేంద్రం జనసంద్రమైనది. కట్టవారిగూడెం విఘ్నేశ్వర రైస్మిల్లు నుంచి గుర్రంపోడు మండల కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దాంతో నల్లగొండ- దేవరకొండ జాతీయ రహదారిపై కిలోమీటరున్నర ప్రజలతో కిక్కిరిసి పోయింది. ఈ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. నాయకులు పార్టీలు మారితేనేమి జనం మాత్రం అభివృద్ధి వెంటే ఉన్నారని, వారంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఈ సభ రుజువు చేసింది. నాగార్జున సాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులంతా ఒకే వేదిక మీదికి రావడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది.