హాలియా, నవంబర్ 5 : బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారని ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. ఆదివారం హాలియాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ అనుముల మండల బూత్స్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమన్నారు.
మన రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పార్టీ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా, 16 ఏండ్లు మంత్రిగా పనిచేసినప్పటికీ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి, ఆయన సొంత మండలమైన అనుములను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడన్నారు. రేపు ఆయన కొడుకు వచ్చి చేయబొయ్యేది కూడా ఏమీ లేదన్నారు. నియోజకవర్గ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయలేకపోయారన్నారు.
ఐదేండ్ల క్రితమే నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని తిరస్కరించాలని, అందుకే ఈ సారి ఆయన పోటీ చేయలేక కొడుకును ఎన్నికల బరిలో నిలిపారని తెలిపారు. జానారెడ్డి 15 ఏండ్లు రికార్డు స్థాయిలో క్యాబినెట్ మంత్రిగా పనిచేయడం వల్ల ఆయన కుటుంబానికే లాభం కలిగింది తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరుగలేదని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేకపోవడంతోనే ఎన్నికల వేల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేసేందుకు ఆ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో ప్రజాబలం ఉన్న బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని.. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం సాగుకు కేవలం 3 గంటల విద్యుత్ చాలని చెబుతున్నారని పేర్కొన్నారు. రైతుబంధు డబ్బులను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి రైతులు తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు
స్వరాష్ట్రంలో పదేండ్లుగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలని, బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోనికి వస్తే చేపట్టబోయే పనులు, పార్టీ మ్యానిఫెస్టోను బూత్ కమిటీ సభ్యులు ఇంటింటికీ వివరించాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. హాలియాను మున్సిపాలిటీగా చేయడంతో పాటు అనుముల మండలం, నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. రాబోయే ఎన్నికల్లో నోముల భగత్ గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో సైనికుల్లా పని చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మే స్థితిలో లేరని, తమ సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి తేవడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులకు, సబ్బండ వర్గాలకు మేలు జరిగిందన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు వాటికి అధిక నిధులు అందించి అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకట్వేర్లు, ఎంపీపీ సలహాదారుడు ఆవుల పురుశోత్తం, మున్సిపల్ వైస్చైర్మన్ నల్లగొండ సుధాకర్, సీనియర్ నాయకులు ఎడవల్లి మహేందర్రెడ్డి, కేవీ రామారావు, పట్టణాధ్యక్షుడు వడ్డె సతీశ్రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, దోరేపల్లి వెంకటేశ్వర్లు, గడ్డం రమణమ్మ, మున్సిపల్ కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, ప్రసాద్నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.