శాలిగౌరారం, మార్చి 1: ప్రభుత్వం అందించే పలు అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మండలంలో పని చేసే ప్రతి అధికారి స్థానికంగానే నివాసం ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ గంట లక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూగర్భ జలాలు అడగంటిపోతున్నందున గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మండలం నుంచి ఇసుక అక్రమ రవాణా కాకుండా చూసుకునే బాధ్యత రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానిదేనని ఈవిషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేదిలేదన్నారు. మండలంలోని బైరవునిబండ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో కొంతమంది అనుమతి లేకుండా ఆక్రమించుకన్నట్లు సమాచారం ఉందని, అట్టి వారిని వెంటనే బయటికి పంపించాలని అధికారులను కోరారు. శాలిగౌరారం ప్రాజెక్టు మరమ్మతు విషయమై నాకు పూర్తి సమాచారం కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, ఎంపీడీఓ రేఖల లక్ష్మయ్య, తాసీల్దార్ అన్వర్ హుస్సేన్, వైస్ ఎంపీపీ కందుల అనిత, ప్రజాప్రతినిధుల, అధికారులు పాల్గొన్నారు.