నల్లగొండ : నిరుపేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం శాలిగౌరారం మండలం బైరోనిబండ గ్రామంలో డా.బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకస్థాపన, పలు లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తూ పల్లెల ప్రగతికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.