నూతనకల్, ఏప్రిల్ 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలతో కరువు నేలను సిరుల భూమిగా మార్చారని, తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఒకప్పుడు ఎకరానికి లక్ష రూపాయలు కూడా పలుకని భూమి ఇప్పుడు రూ.50 లక్షల వరకు పలుకుతుందని తెలిపారు. నూతనకల్ మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, డప్పు చప్పుళ్లతో మహిళలు, పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలివచ్చారు.
అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా జరుగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలు చేయాలని లేదంటే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలుపాలని మహారాష్ట్రలోని రాయచూర్ రైతులు, ప్రజలు కోరుతున్నారని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సొంత రాష్ట్రం గుజరాత్లో వ్వవసాయానికి కరెంటు 6 గంటలే ఇస్తూ బిల్లులు వసూలు చేస్తున్న ప్రధాని మోదీని గెలిపిద్దామా.. ఉచిత కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను గెలిపిద్దామా అని ప్రజలను ప్రశ్నించారు.
రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారం రోజుల్లోనే డబ్బులు జమ చేస్తున్నదని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లక్షా 116 రూపాయలు అందిస్తూ ఆదుకుంటున్నదన్నారు. రాజకీయంగా సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేకనే ఎమ్మెల్సీ కవితను ఈడీ రూపంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పునాదులు కదిలించాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని గడపగడపకూ వెళ్లి వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి
రాష్ట్రంలోని ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అందుకే ప్రజలంతా సీఎం కేసీఆర్కు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. సమైక్య పాలకుల చేతిలో తీవ్ర అన్యాయానికి గురైన తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులు, కాల్వలు బాగుపడి బీడు భూములు పచ్చని పంటలతో సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు.
గతంలో భూములు అమ్ముదామంటే కొనే దిక్కులేకుండా పోయేదని, ఇప్పుడు కొందామన్నా అమ్మేవారు లేరని అన్నారు. ఇదే సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో సాధించిన అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, వైస్ ఎంపీపీ జక్కి పరమేశ్, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమ, నాయకులు బత్తుల సాయిలుగౌడ్, చురకంటి జానకమ్మ, గాడ్దుల రజిత, తాడూరి లింగయ్య, అయోధ్య, బద్దం వెంకట్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, విద్యాసాగర్, విజయ, సైదిరెడ్డి పాల్గొన్నారు.