నల్లగొండ సిటీ, జూన్ 18 : గతంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్లేదని, స్వరాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత నీరు అందిస్తున్నామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన మంచినీళ్ల పండుగలో కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని, ఆ నీటిలో మినరల్స్ తగిన మోతాదులో ఉన్నాయని అన్నారు. మినరల్ వాటర్ వాడితే రోగాలు కొనితెచ్చుకున్నట్లేనని పేర్కొన్నారు. గతంలో వేసవిలో భూగర్భ జలాలు పడిపోయి తాగునీటి కొరత ఏర్పడితే వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకొని ట్యాంకర్ల ద్వారా పది రోజులకోసారి నీటి సరఫరా చేసేదని తెలిపారు.
ఈ పరిస్థితి రాకుండా ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం చేపట్టిందన్నారు. సమైక్య పాలనలో నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల ప్రజలు మంచినీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు మిషన్ భగీరథతో ఆ తిప్పలు తప్పాయని చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంలో రూ.131 కోట్లతో, నకిరేకల్ నియోజకవర్గంలో రూ.128 కోట్లతో పనులు చేపట్టి నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ అవసరానికంటే ఎక్కువ నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో నీటిని శుద్ధి చేయకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడేవారని, ఇప్పుడు నీటి ద్వారా వచ్చే రోగాలు తగ్గాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్యాదవ్, ఆర్డబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ మధుబాబు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.