నల్లగొండ రూరల్, అక్టోబర్ 8 : దళితులను 75 ఏండ్లుగా ఎవరూ పట్టించుకోలేదని.. సమాజంలో అందరితో సమానంగా వారి గౌరవం పెంచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకానికి శ్రీకారం చూట్టారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో దళితబంధు రెండో విడుత లబ్ధిదారులకు అదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు దళితబంధు ప్రొసిడింగ్ పత్రాలు అందజేసి యూనిట్ల ఎంపికపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు మొదటి విడుతలో నల్లగొండ నియోజకవర్గంలో 100 మందికి యూనిట్లు అందజేశామన్నారు. అందులో ఎక్కువగా కోళ్లఫామ్, డెయిరీ ఫామ్తోపాటు లాభాలు వచ్చే వాటిని ఎంపిక చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు.
రెండో విడుతలో ఎంపికైన 1100 మంది లబ్ధిదారులు ఉన్నతాధికారుల సూచన మేరకు ఆర్థిక అభివృద్ధి చెందే వ్యాపారాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రూ.10 లక్షలతో దిన దినాభివృద్ధి చెంది కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వంటి కుట్రదారులు దళితులకు దళిత బంధు ఎందుకు అంటున్నారని, అలాంటి నాయకులకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. నల్లగొండ పట్టణం విస్తరిస్తున్నదని, హైదరాబాద్ తరహాలో ఎన్నో రకాల బిజినెస్లకు అడ్డాగా మారనుందని చెప్పారు. దళిత బంధు లబ్ధిదారులు తెలివిగా ఆలోచించి ఆర్థిక అభివృద్ధి సాధించే వ్యాపారాలు పెట్టుకోవాలని సూచించారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ దళిత బంధు పథకం ప్రారంభంలో ఇది సక్సెస్ అవుతుందో.. కాదోనని, లబ్ధిదారులు డబ్బు వృథా చేస్తారనే అపోహలు ఉండేవన్నారు. పైలట్ ప్రాజెక్ట్గా హుజూరాబాద్ను తీసుకొని రూ.1800 కోట్లు ఇచ్చారని, ఇప్పుడు వారంతా నెలకు లక్ష నుంచి 2లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారని తెలిపారు. దళిత బంధు ఒక సువర్ణ అవకాశమని, యూనిట్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకంలో ఎంపికైన వారంతా త్వరలో కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. అనంతరం దళితబంధు పొందిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం భేతిగల్ గ్రామానికి చెందిన జీఎస్ గౌతమ్ కృష్ణ తీసిన ది కాప్ సినిమా ఫస్ట్ లాంచ్ పోస్టర్ను ఆవిష్కరించారు.
దళిత బంధు డబ్బుతో సక్సెస్ సాధించిన గౌతమ్ కృష్ణను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ సదస్సుకు పిలిపించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీంపాషా, విజయలక్ష్మి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు నాగరత్నం రాజు, వాసుదేవరెడ్డి, శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దళితబంధుతో రెండు సినిమాలు తీశాను
నాకు చిన్నప్పటి నుంచీ సినిమా తీయాలనే తపన ఉండేది. కానీ ఆర్థిక పరిస్థితులతో సాధ్యం కాలేదు. సీఎం కేసీఆర్ పుణ్యమా అని దళిత బంధు ప్రవేశ పెట్టడంతో సినిమా కెమెరాలకు దరఖాస్తు చేసుకున్నా. అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ దళిత బంధు యూనిట్ మంజూరు చేశారు. ఇప్పుడు రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న. సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇప్పటి వరకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించా. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరిన్ని సినిమాలు చేస్తా.
– గౌతమ్కృష్ణ, దళితబంధు లబ్ధిదారుడు, భేతిగల్, వీణవంక మండలం, హుజూరాబాద్ నియోజకవర్గం
నందికొండలో పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద తరలివచ్చారు. దాంతో బుద్ధవనం, లాంచీస్టేషన్, సాగర్ డ్యామ్ పరిసరాల్లో సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం శాఖ కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలి ట్రిప్పు, నాగార్జున కొండకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. బుద్ధ్దవనంలో బుద్ధుడి జీవిత గాథలు తెలిపే అష్టాంగ మహాస్థూపాన్ని దర్శించుకున్నారు.
– నందికొండ, అక్టోబర్ 8