చందంపేట (దేవరకొండ)/ దేవరకొండ రూరల్/ హాలియా, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్న తెలంగాణను కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఆగం పట్టించిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దేవరకొండ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అదేవిధంగా హాలియా పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అధ్యక్షతన నాగార్జున సాగర్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రైతులు, అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడాన్ని గుర్తుచేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజులైనా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోతుంటే మంత్రులకు పరిశీలించే సమయం కూడా లేకుండా పోతున్నదని, రైతులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరికల కోసం గేట్లు ఎత్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతులను ఆదుకోవాలని సూచించారు. కొందరు నేతలు స్వలాభం కోసం పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదని, గ్రామ స్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఉన్నదని అన్నారు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోవడాన్ని తట్టుకోలేక మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించారని తెలిపారు. చనిపోయిన రైతుల వివరాలను సీఎం రేవంత్రెడ్డి అడిగితే కేసీఆర్ నాలుగు గంటల్లోనే పంపితే స్పందించకుండా గమ్మున ఉండిపోయారని పేర్కొన్నారు. కేసీఆర్ కరీంనగర్ వెళ్తానంటే కాళేశ్వరం గేట్లు ఎత్తి నీళ్లు వదిలారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు, రైతుల సంక్షేమం, వృత్తిదారుల గురించి ఆలోచించేవారన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఎవరిపైనా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయలేదని పేర్కొన్నారు.
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి వంద రోజులు దాటినా చేయని సీఎం రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, మహిళలకు రూ.2,500, నెలకు రూ.4వేల పెన్షన్ ఇలా ఎన్నో మోసపూరిత పథకాలతో అధికారంలోకి వచ్చి నేడు విస్మరిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి.. కాంగ్రెస్ వైఫల్యాలను, మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కేసీఆర్లా పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థి, రైతు బిడ్డ కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వడ్త్య రమేశ్నాయక్, గాజుల ఆంజనేయులు, బిల్యానాయక్, నేనావత్ కిషన్నాయక్, జర్పుల లోక్యానాయక్, మండలాధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, వల్లపురెడ్డి, వెంకటేశ్వర్రావు, దస్రూనాయక్, శంకర్నాయక్, ఎంపీపీ సునీతాజనార్దన్రావు, నాయకులు గోవిందుయాదవ్, పల్లా ప్రవీణ్రెడ్డి, నీలా రవి, కంకణాల వెంకట్రెడ్డి, సుధీర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ముడావత్ శ్రీను, తౌఫిక్, రహత్అలీ, ఇలియాస్ పటేల్, బాబా, రాజు, కృష్ణ, బాలయ్య, రాము లు, రాములుగౌడ్, రవి, నర్సయ్య పాల్గొన్నారు.
హాలియాలో జరిగిన సమావేశంలో అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, ఇస్లావత్ రాంచందర్నాయక్, యడవల్లి విజయేందర్రెడ్డి, కడారి అంజయ్యయాదవ్, కట్టెబోయిన గురువయ్యయాదవ్, ఎంపీపీలు సుమతీ పురుషోత్తం, అనూరాధ సుందర్రెడ్డి, బొల్లం జయమ్మ, పీఏసీఎస్ చైర్మన్ కేవీ రామారావు, నాయకులు జవ్వాజి వెంకటేశ్వర్లు, కామర్ల జానయ్య, యడవల్లి మహేందర్రెడ్డి, ఎక్కలూరి శ్రీనివాస్రెడ్డి, కూరాకుల వెంకటేశ్వర్లు, రవినాయక్, నాగయ్య, సత్యపాల్, సతీశ్రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.