ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం హారతి పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నది. కారు పార్టీని ఎలాగైనా
గెలిపించుకోవాలనే కసి కార్యకర్తలతోపాటు సామాన్య ఓటర్లలోనూ కనిపిస్తున్నది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు, ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉదయం 7గంటల నుంచే కదన రంగంలోకి దిగుతున్నారు. గ్రామ గ్రామాన ఇంటింటికీ వెళ్లి క్యాంపెయిన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు, నేతలతోపాటు పలు సంఘాలతో సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, కండువాలే దర్శనమిస్తున్నాయి. విపక్షాలకు వణుకు పుట్టేలా బీఆర్ఎస్ ప్రచారపర్వం
హోరెత్తుతున్నది.
యాదాద్రి భువనగిరి, నవంబర్10 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు జనం నీరాజనం పడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అన్ని వర్గాల నుంచి గులాబీ పార్టీకి విశేష స్పందన లభిస్తున్నది. తెలంగాణను సాధించిన పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలని కార్యకర్తలతోపాటు సామాన్య ఓటర్లలోనూ కనిపిస్తున్నది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పల్లె, పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, కండువాలే దర్శనమిస్తున్నాయి. గల్లీగల్లీలో పార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారు. ప్రతిపక్షాలకు వణుకు పుట్టేలా ప్రచారం హోరెత్తుతున్నది.
నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార రంగంలోకి దిగారు. మహిళలు బోనాలు, బతుకమ్మలు, కోలాటాటాలు, డప్పుచప్పుళ్లతో అభ్యర్థులకు ఘనస్వాగతం పలుకుతున్నారు. నేతలంతా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి క్యాండిడేట్ పైళ్ల శేఖర్రెడ్డి, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ అభ్యర్థులు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య నియోజవకర్గంలోని పల్లెపల్లెనా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలు తెప్పించుకుని.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేస్తున్నారు. కేసీఆర్ సారథ్యంలో ఇప్పటి వరకు ఏం చేశారు..? ఎలాంటి లబ్ధి పొందారు..? గెలిస్తే ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి..? ప్రతిపక్ష పార్టీ గెలిస్తే జరిగే నష్టం ఏంటి..? అనేవి విపులంగా వివరిస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. కులాల వారీగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. సమ్మేళనాలకు పెద్దఎత్తున ఆయా సామాజిక వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఆయా కులాలకు ప్రభుత్వం ఏం చేసింది..? ఎలా ఆదుకుంది..? గత ప్రభుత్వాలు ఏం చేశాయి..? అనేది స్పష్టంగా వివరిస్తున్నారు. ఇటీవల భువనగిరిలో ముదిరాజుల సమ్మేళనం విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. భువనగరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి సతీమణి వనితారెడ్డి, కూతురు మన్వితా రెడ్డి, ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత భర్త గొంగిడి మహేందర్రెడ్డి, కూతుళ్లు అంజనీరెడ్డి, హర్షితారెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇస్తూ కారెక్కుతున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ నుంచి గులాబీ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. ఊర్లకు ఊర్లే గులాబీ పార్టీ బాట పడుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సమక్షంలో కారెక్కుతున్నారు. గులాబీ కండువా కప్పుకొంటూ బీఆర్ఎస్ను గెలిపిస్తామని ప్రతినబూనుతున్నారు.