మిర్యాలగూడ, జనవరి 16 : మిర్యాలగూడను క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వాహనాలతో ప్రతి వాడకు వెళ్లి చెత్త సేకరించాలని, ఈ విషయంలో కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి లక్పతినాయక్ చేసిన సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో విజేతలకు లక్పతినాయక్ మెమోరియల్ ట్రస్ట్ వారు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దివంగత లక్పతినాయక్ పేరు మీద అతడి కుమారుడు మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు విద్యా, వైద్య సదుపాయం అందించడం అభినందనీయమన్నారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సక్రూనాయక్ మాట్లాడుతూ లక్పతినాయక్ ట్రస్ట్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్, ఎంఈఓలు బాలాజీనాయక్, ఛత్రునాయక్, ప్రధానోపాధ్యాయుడు ధర్మానాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ధీరావత్ స్కైలాబ్నాయక్, పద్మ, కొర్ర కృష్ణకాంత్నాయక్, నానిన్యనాయక్, ఉమాకర్రెడ్డి, హనుమంతునాయక్, హాతీరాంనాయక్, వెంకన్న, గోపీనాయక్, తిరుపతినాయక్ పాల్గొన్నారు.