సాధారణంగా వేసవి అనంతరం భూగర్భజలాలు పడిపోయి నీటి లభ్యత తగ్గిపోతుంది. కానీ, ఈ వానకాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బోర్లు, బావుల్లో నీటికి ఇబ్బందికి ఉండకపోవచ్చు. పంటల సాగు సాఫీగా సాగేందుకు అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తోడు, కృష్ణా జలాల్లోని వాటాను సద్వినియోగం చేసుకోవడంతో జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా పైకి వచ్చాయి. వాటికి మూసీ జలాలు తోడయ్యాయి. ఈ వేసవిలోనూ చాలా చెరువులు, కుంటల్లో నీరు తొణికిసలాడింది. ఫలితంగా వరుసగా మూడో ఏడాది కూడా భూగర్భజలాలకు ఢోకా లేకుండాపోయింది. ఇక భారీ వర్షాలు కురవకపోయినా, చెరువులు, కుంటలు, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులోకి కొత్తగా వరద నీరు వచ్చి చేరకపోయినా గతేడాదితో పోలిస్తే భూగర్భజలాలు పుష్కలంగానే అందుబాటులో ఉన్నాయి. జిల్లా భూగర్భజల వనరుల శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ సీజన్లో పంటలకు ఇబ్బంది ఉండకపోవచ్చు.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 15 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతేడాది కురిసిన వర్షాలతో చెరువులు కుంటల్లోకి నీరు చేరింది. మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, కట్టలు పటిష్టపర్చడంతో నీటితో కళకళలాడాయి. ఆ నీరు ఈ వేసవిలోనూ చాలా చెరువుల్లో కనిపించింది. నాన్ఆయకట్టు ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు ఉండడం ఈ సారి ప్రత్యేకత. ఇక వర్షాలకు తోడు కృష్ణానది జలాలు కూడా ఏడాది పొడవునా జిల్లాలో ప్రవహించాయి. కృష్ణాజలాల్లో రాష్ట్ర వాటాను సాధ్యమైనంత వరకు వినియోగించుకోవడంలో భాగంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి నిరాటంకంగా నీటి విడుదల జరిగింది. జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమకాల్వతోపాటు ఎస్ఆర్ఎస్పీ, ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ వరద కాల్వల్లో నిరంతరంగా నీటి ప్రవాహం కొనసాగింది. వేసవిలోనూ కాల్వల్లో నీటి గలగలలు వినిపించాయి. వీటి పరిధిల్లోని చెరువులు, కుంటల్లోనూ నీరు సమృద్ధిగా నిల్వ ఉంది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో భూగర్భజలాలు బాగా పైకి వచ్చాయి.
తేడా స్వల్పమే..
నల్లగొండ జిల్లా పరిధిలోని ఆయకట్టు, నాన్ ఆయకట్టు ప్రాంతాల్లోని భూగర్భజలాలను సగటుగా తీసుకుంటే గతేడాది జూన్లో 7.28మీటర్లు లోతున నీరుండగా, ఈ ఏడాది జూన్లో 7.64 మీటర్ల లోతులో ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 2022 జూన్లో 6.33మీటర్ల లోతుల్లో నీళ్లుండగా, ఈ జూన్లో 6.24 మీటర్లలోనే లభిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతేడాది జూన్లో 7.72మీటర్ల లోతులో ఉండగా, ఈ జూన్లో 7.83మీటర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. నాన్ఆయకట్టు ప్రాంతాల్లోని మెజార్టీ మండలాల్లోనూ 8మీటర్ల లోతుల్లోనే భూగర్భజలాలు ఉండడం విశేషం.
సగటు నీటిమట్టం 8 మీటర్ల లోతులోనే..
ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాల సగటు నీటిమట్టం 8 మీటర్ల లోతులోనే ఉండడం విశేషం. నల్లగొండ జిల్లాలో ఈ జూన్లో 7.64 మీటర్ల లోతు లో, సూర్యాపేట జిల్లాలో 6.24 మీటర్ల లోతులో, యాదాద్రి భువనగిరిలో 7.83 మీటర్ల లోతులో నీటిమట్టాలు నమోదయ్యాయి. గతేడాది జూన్తో పోలిస్తే నల్లగొండ జిల్లాలో 0.36 మీటర్ల లోతుకు పడిపోగా సూర్యాపేట జిల్లాలో 0.09 మీటర్లు పైకి, యాదాద్రి జిల్లాలో 0.11 మీటర్ల లోతుకు పడిపోయినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఇంచుమించు గతేడాది జూన్ నీటిమట్టాలే తలపిస్తున్నాయి. ఇంకా కృష్ణా, గోదావరి జలాలు ఉమ్మడి జిల్లాకు చేరితే మరింతగా పైకి రానున్నాయి. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కాళేశ్వరం జలాలు త్వరలోనే రానున్నాయి. నాగార్జునసాగర్ జలాశయానికి ఇంకా వరద మొదలుకాలేదు. ఆగస్టు రెండో వారం వరకు నీరు విడుదలైతే భూగర్భజలాలు పెరుగనున్నాయి. మూసీ ఆయకట్టుకు ఈ నెల 18 నుంచి నీటి విడుదల చేయనున్నారు. దాంతో ఆయకట్టు ప్రాంతాల్లో నీటి విడుదలతో మరింతగా భూగర్భజలాలు పైకి రానున్నాయి. నల్లగొండ జిల్లాలో 2020 జూన్లో పరిశీలిస్తే 14.95 మీటర్ల లోతులో నీరు ఉన్నది. అంటే అప్పటికీ ఇప్పటికీ సగం తేడా కనిపిస్తున్నది.
నల్లగొండ జిల్లాలో…
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా మిర్యాలగూడ డివిజన్లో 7.66 మీటర్ల లోతులో, నల్లగొండ డివిజన్లో 7.85 మీటర్లు లోతులో, దేవరకొండ డివిజన్లో మాత్రం 7.47 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. ఇక గత ఏడాది జూన్తో పోలిస్తే నల్లగొండలో 0.63 మీటర్లు పైకి రాగా, మిర్యాలగూడలో 0.72 మీటర్లు, దేవరకొండ డివిజన్లో 0.89 మీటర్ల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇక దామరచర్ల మండలంలో కేవలం 3.13 మీటర్ల లోతులోనే నీరు చేతికందేలా ఉన్నది. ఆ తర్వాత మిర్యాలగూడలో 3.96 మీటర్ల లోతులో నీరు ఉంది. ఇక అత్యధికంగా కేతేపల్లి మండలంలో 12.83 మీటర్ల లోతులో, చందంపేటలో 12.56, వేములపల్లి 4.98, మాడ్గులపల్లి 5.18, గట్టుప్పల్ 5.21, త్రిపురారం 5.24, గుర్రంపోడు 5.27, డిండి 5.33, మునుగోడు 5.61, కొండమల్లేపల్లి 5.90, పెద్దవూర 6.08, నకిరేకల్ 6.12, కనగల్ 6.13, పీఏపల్లి 6.21, అనుముల 6.63, మర్రిగూడ 7.04, తిప్పర్తి 7.05, తిరుమలగిరి(సాగర్)7.07, నల్లగొండ 7.10, నిడమనూరు 7.14, చింతపల్లి 7.59, నార్కట్పల్లి 7.72, దేవరకొండ 8.01, నాంపల్లి 8.21, నేరేడుగొమ్ము 8.51, శాలిగౌరారం 8.54, చండూర్లో 8.73, చిట్యాల 9.14, అడవిదేవులపల్లి 11.05, కట్టంగూర్లో 11.96 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని బోర్లు, బావులన్నీ వానకాలం పంటలకు సాగునీటిని సమృద్ధిగా అందించనున్నాయి.