దామరచర్ల/ అడవి దేవులపల్లి, సెప్టెంబర్ 29 : గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మండలంలో రూ.90 లక్షలతో చేపట్టే గాంధీనగర్ – కల్లేపల్లి రోడ్డు పనులకు, రూ.4.20 కోట్లతో నిర్మించనున్న గిరిజన గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల రోడ్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి, విద్యకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. 65 ఏండ్ల సమైక్య పాలనలో గరుకుల విద్యాలయాల సంఖ్య 91 ఉండగా.. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలో మరో 98 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
నాడు అన్ని కులాలకు 260 ఉండగా.. నేడు 1008 గురుకులాలు వచ్చాయన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. గురుకులాల్లో ప్రతి విద్యార్థికి సగటున ఏడాదికి లక్షా 20వేల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. వృత్తిపరమైన కోర్సులను అందిస్తున్నామని, విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క గురుకుల విద్యపైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సమైక్య పాలనలో గిరిజనులను పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరజనులకు పాలనా అవకాశం కల్పించారని చెప్పారు. అనంతరం మండలంలో 25 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. అంతకుముందు కల్లేపల్లి బంగారుమైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.
నియోజకవర్గంలో రూ.7,500 కోట్లతో అభివృద్ధి
మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.7,500 కోట్లతోఅభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే భాస్కర్రావు తెలిపారు. దామరచర్ల మండలంలో రూ.35వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంటు, రూ.700 కోట్లతో నాలుగు ఎత్తిపోతల పథకాల పనులు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమాల్లో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్నాయక్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీలు ధీరావత్ నందిని, ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీలు ఆంగోతు లలిత, కుర్ర సేవ్యానాయక్, ఆర్డీఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటగిరి, స్థానికప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.