తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించనున్నారు. జిల్లా మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి రూ.52 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, కల్వర్టులు, బతుకమ్మ ఘాట్, కమ్యూనిటీ హాల్, సెంట్రల్ లైటింగ్, మున్సిపల్ కార్యాలయం భవనం, మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ప్రగతి నివేదిక సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సభ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తిరుమలగిరి జూన్ 28 : తిరుమలగిరిలో నేడు జరిగే ప్రగతి నివేదన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తిరుమలగిరి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సభకు మంత్రి కేటీఆర్తోపాటు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొననున్నారు.
భారీ బందోబస్తు
ఈ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ ఇతర అంశాలపై పోలీస్ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం మండలాల నుంచి వచ్చే వాహనాలను బహిరంగ సభ జరిగే ప్రదేశంలో ఎడమ వైపు, మోత్కూర్, అడ్డగూడూరు మండలాల నుంచి వచ్చే వాహనాలను తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ వారాంతపు సంత ఖాళీ స్థలంలో, తొర్రూర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను హెలిప్యాడ్ సమీపంలోని ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. సభకు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారు.