నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రూ.56 కోట్ల అభివృద్ధి
పనులకు శంకుస్థాపన
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే భగత్, కలెక్టర్ పీజే పాటిల్
హాలియా, మే 6 : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలో సుమారు రూ. 56 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ శుక్రవారం సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను అదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నట్లు చెప్పారు.
హాలియాలో ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం, వైకుంఠధామం, సీసీ రోడ్లు, నందికొండ మున్సిపాలిటీలో ఆడిటోరియం, వైకుంటదామం, డిజిటల్ లైబ్రరీ, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు, రోడ్డు విస్తరణ, బస్టాండ్ పునర్నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల శర్మ, మిర్యాలగూడెం ఆర్డీఓ రోహిత్ సింగ్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సత్యనారాయణ, హాలియా మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కమిషనర్లు వేమనరెడ్డి, రవిందర్రెడ్డి, తాసీల్దార్ లావూరి మంగ, ఎంపీడీఓ లక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు నల్లబోతు వెంకటయ్య, అన్నేపాక శ్రీనివాస్, వర్రా వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జీ పిల్లి అభినయ్ పాల్గొన్నారు.