నల్లగొండ: జూన్ 2, 2022, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నల్లగొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు స్పష్టంగా మార్పు తెలియాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, టెక్స్టైల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. స్థానిక జీఎం ఫంక్షన్ హాలులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి జిల్లాలోని మున్సిపాలిటీలలో, నల్లగొండ పట్టణంలో చేపట్టాల్సిన పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నల్గొండ పట్టణంలో మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలి. మున్సిపల్, రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖల అధికారుల సమన్వయంతో నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు.
గత రెండు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ పట్టణాన్ని సందర్శించినప్పుడు ఆశించిన స్థాయిలో నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి సాధించలేదని, దాని కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలనే ఆదేశాలతో తాము ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
నల్లగొండ పట్టణంలో చేపట్టిన పాదయాత్రలో ప్రజలు, షాప్ యజమానులు ఇంకా ఏమి కోరుకుంటున్నారనే విషయాలు అడగడం జరిగిందని, మంచినీరు రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా వస్తున్నాయని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ఇన్వెస్టర్ల అవసరం కూడా లేనందున తీసివేయడం జరిగిందని తెలిపారని, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పకడ్బందీగా అమలు అవుతున్నాయని, ఆసరా పింఛన్లు టంచన్గా వస్తున్నాయని తెలిపారని, ఇంకా ఏమి మార్పు కావాలని అడిగితే, రోడ్ల పరిస్థితి బాగా లేదని, ఉపాధి అవకాశాలు తీసుకురావాలని, పరిశ్రమలు పెంచాలని సూచించడం జరిగిందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్కు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద 7 ఎకరాల స్థలంలో ఆడిటోరియం ఏర్పాటు చేయాలని ఆదేశించినందున ఆర్ అండ్ బీ శాఖ వారు స్థల ప్రతిపాదనలు సిద్ధం చేస్తే మున్సిపల్ శాఖ వెంటనే చర్యలు చేపట్టడం జరుగుతుందని, దాని కోసం ఆర్ అండ్ బీ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం నల్లగొండ పట్టణంలో రెండు స్థలాలు వెతకాలని, అలాగే రైతు బజారు ఏర్పాటు కోసం రెండు చోట్ల స్థలాలు ఎంపిక చేయాలని, అర్బన్ లంగ్ స్పేస్ కోసం రెండు చోట్ల స్థలాలు ఎంపిక చేయాలని కేటీఆర్ తెలిపారు. మున్సిపాలిటీలు ఆదాయం పెరిగే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ముందుగా ఆరు ముఖ్యమైన జంక్షన్లను ఫుట్ పాత్లు, సర్వీస్ రోడ్లతో ఏర్పాటు చేయాలని, పట్టణంలో ప్రస్తుతం ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాల స్థానంలో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు వెడల్పు చేసే చోట చెట్లను నరకవద్దని, అవసరమైన చోట జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో వాటిని వేరే ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వైకుంఠధామం, కబ్రిస్తాన్, సిమెట్రీలను సుందరీకరించాలని మంత్రి తెలిపారు.
ఉదయ సముద్రం సుందరీకరణ, అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా నల్లగొండకు రూ.100 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 30 కోట్లు వివిధ పనులకు శాంక్షన్ చేశామని, మిగతా 70 కోట్లతో పనులకు టెక్నికల్ శాంక్షన్స్ పొందాలని సూచించారు. నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నెలకు ఒకసారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి పనులు పరిశీలిస్తామని తెలిపారు. నల్లగొండ చుట్టూ 50 ఎకరాలలో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి టౌన్షిప్ ఏర్పాటు చేయాలని, తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ ఒక రోల్ మోడల్ గా నిలవాలని, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలనేది సీఎం గారి కోరిక అని కేటీఆర్ అన్నారు.
ప్రతి రోజు ఇంటింటికి మంచినీటి సరఫరా కోసం ఏమి చేయాలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి అధికారులతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు. నల్లగొండ పట్టణంలో రోడ్ల వెడల్పు సందర్భంగా వీధి వ్యాపారులను ఆదుకోవాలని, వారి కోసం వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మున్సిపల్, రెవిన్యూ, ఆర్అండ్బీ, ఎలక్ట్రిసిటీ అధికారులు ప్రతివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కన్వర్జెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నల్లగొండ అభివృద్ధిలో భాగంగా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, మంచి సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు.
మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి పట్టణ ప్రగతి కింద 72 కోట్ల 72 లక్షల కేటాయించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం 500 కోట్లు, వైకుంఠ ధామాలకు 200 కోట్లు కేటాయించామని తెలిపారు. మున్సిపాలిటీలకు సొంత ఆదాయం ద్వారా, టీఎఫ్ఐడీసీ ద్వారా, కేంద్ర గ్రాంటు ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక బడ్జెట్ ద్వారా నిధులు అందజేయడం జరుగుతుందని, ప్రతి మున్సిపాలిటీ సొంత ఆదాయం పెంచుకునేందుకు అన్ని మున్సిపాలిటీలలో ప్రభుత్వ స్థలాలు ఎంపిక చేసుకొని నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా టౌన్ షిప్ల ఏర్పాటుతో ముందుకు వెళ్లాలని, ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం ఆదేశాలతో ఈరోజు రావడం జరిగిందని, టౌన్ హాల్ భూములకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ను ఆదేశించారు. పట్టణంలో ఫోర్వే లైన్ రోడ్డు, ఫుట్ పాత్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, సుందరీకరణ, వెడల్పు కోసం ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు.