నల్లగొండ రూరల్/నల్లగొండ సిటీ/తిప్పర్తి,మార్చి 3 : తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి పథకం కింద రూ.500 వంటగ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అందిస్తున్నామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క, హైదర్ఖాన్గూడ, రహమత్ నగర్ ప్రాంతాల్లో, కనగల్ మండల కేంద్రం, తిప్పర్తి మండలం మర్రిగూడెం గ్రామంలో ఆదివారం గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన వారికి జీరో బిల్లులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహా జ్యోతి కింద జిల్లాలో లక్షా82 వేల మంది లబ్ధి పొందుతున్నారన్నారు.
ఈ నెల 11న ఇండ్లు లేని పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, ఇంటి స్థలం లేని వారికి స్థలాన్ని చూపించి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని మామిళ్లగూడెంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో మా న్యంచెల్కలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కొత్తభవనాన్ని నిర్మిస్తామన్నారు. వేసవిలో తాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగు నీరు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, నల్లగొండ ఆర్డీఓ రవి, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, ట్రాన్స్కో ఎస్ఈ చంద్రమోహన్, డీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈలు చంద్రమోహన్, తాసీల్దార్లు స్వప్న, పద్మ, ఏడీ సత్యనారాయణ, ఏఈ రమ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.