నల్లగొండ సిటీ, జనవరి 27 : నల్లగొండ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలో చిల్డ్రన్, వృద్ధుల ఆశ్రమ భవనాలకు శంకుస్థాపనతోపాటు స్కిల్ డెవలప్మెంట్, లేడీస్ టైలరింగ్ యూనిట్స్ ప్రారంభోత్సవాలు, ముషంపల్లిలో రూ. 99.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం మాట్లాడుతూ..సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి సొరంగ మార్గం పూర్తయ్యేందుకు కృషి చేస్తానన్నారు. ఏఎమ్మార్పీ కాల్వలకు లైనింగ్ లేక పోవడంతో నీళ్లు రావడం లేదని, మెయిన్ కెనాల్ లైనింగ్ కోసం రూ.510కోట్లతోపాటు డి-25, డి-22 డిస్ట్రిబ్యూటర్ల లైనింగ్ కోసం రూ.310 కోట్లతో నెలలోగా టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. అంతకు ముందు పానగల్లో రూ.1.35 కోట్లతో నిర్మించనున్న బాలసదనం, రూ.50 లక్షలతో నిర్మించనున్న వయోవృద్ధుల వసతి గృహం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రేణుకా ఎల్లమ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం దర్వేశిపురంలో వాయులేరు వాగుపై రూ.12.40 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్ఆర్, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి, డైరెక్టర్ రాజిరెడ్డి, జడ్పీటీసీ లక్ష్మయ్య, తాసీల్దార్ జ్యోతి, ఆలయ చైర్మన్ అలుగుబెల్లి నర్సింహారెడ్డి, జడ్పీటీసీ చిట్ల వెంటేశం, నాయకులు పాల్గొన్నారు.
యువత నైపుణ్యాలను పెంచుకొని జీవితంలో స్థిర పడాలని రోడ్ల, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో రూ. 20 కోట్ల ఏర్పాటు చేయనున్న జిల్లా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం భవన నిర్మాణ పనులు శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు, కోర్సులకు కావాల్సిన పరికరాల విషయంలో రాజీ పడమని స్పష్టం చేశారు.