జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో మంత్రిపాల్గొని మాట్లాడారు. చదువుకునేందుకు పేదరికం అడ్డు కాదని, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్పప్పుడే భవిష్యత్ గొప్పగా ఉంటుందని అన్నారు. చదువు అంటే ఉద్యోగం అనే భావన యువతను పట్టి పీడిస్తుందని, దానిని వీడాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధించాలనే తపన, పట్టుదల ఉండాలని.. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ ఇస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు, అధ్యాపకులను మంత్రి సత్కరించారు. అనంతరం కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు.
సూర్యాపేట టౌన్ ఏప్రిల్ 28 : ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపుగా విద్యార్థులు భావించాలని సూర్యాపేట ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని రవి మహల్లో శుక్రవారం పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు హజరుకానున్న అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.యువత నిరంతరం ఆశావాహులై ఉండాలని అప్పుడే విజయం సాధ్యమవుతుందన్నారు. విద్యను అభ్యసించేందుకు పేదరికం అడ్డ్డూ రాదని అందుకే ఆలోచనలతో పేదరికం దరి చేరకుండా చేసుకోవచ్చునని సూచించారు. గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే వారి భవిష్యత్ గొప్పగా ఉంటుందని వారు అనుకున్న లక్ష్యాలు చేరుకోగలుగుతారని తెలిపారు.
చదువు అంటే ఉద్యోగం అనే భావన యువతను పట్టి పీడిస్తుందని ఆ భావనను యువత విడనాడాలని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధించాలనే తపనతో పాటు, పట్టుదల ఉండాలని క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని యువతకు సూచించారు. ప్రస్తుతం ఉన్న పెద్ద పెద్ద వ్యాపార, పారిశ్రామిక వేత్తలు పుట్టుకతో కోటీశ్వరులు కారని సామాన్య ప్రజలేనని గుర్తు చేశారు. కానిస్టేబుల్ పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు. పోలీస్ అభ్యర్థ్ధులకు శిక్షణ అందించిన వివిధ శాఖల ఉద్యోగులను, అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు పాల్గొన్నారు.