సూర్యాపేట రూరల్, జూన్ 6 : తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇమాంపేటలో 36 ఎకరాల స్థలంలో ఆటోనగర్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి గోసపడ్డ తెలంగాణ ప్రజలు అనతికాలంలోనే పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అనూహ్యమైన ప్రగతి సాధించి శాఖల వారీగా ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏ లక్ష్యం కోసం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే దిశగా తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు. గతంలో సబ్స్టేషన్లపై దాడులు జరిగిన పరిస్థితుల నుంచి నేడు సబ్స్టేషన్లలోనే ఉత్సవాలు జరుపుకునే స్థితికి తెలంగాణ చేరిందన్నారు. పోలీసులు, ప్రజలకు మధ్య తీవ్రమైన అఘాధం ఉండేదని, ప్రస్తుతం పోలీసులతో మమేకమై ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనడం తెలంగాణలో పరిఢవిల్లుతున్న శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు.
కరెంటు కోసం ఎదురు చూసిన కార్మికులు నిరంతర కరెంటుతో జీవితాల్లో వెలుగులు నింపుకొన్నారని పేర్కొన్నారు. తెలంగాణపై అక్కసు వెళ్లగక్కే మాజీ సీఎం చంద్రబాబునాయుడు తమతో విడిపోయిన తెలంగాణ అభివృద్ధిలో ఎంతో ముందుందని ఇటీవల టీడీపీ ప్లీనరీలో వ్యాఖ్యానించడం తెలంగాణ అభివృద్ధిలో ఎంత ముందుందో అర్థం చేసుకోవాలన్నారు. దేశంలోనే నంబర్వన్ ఇండస్ట్రియల్ పార్క్గా దండుమల్కాపూర్ అవతరించిందని, పారిశ్రామిక రంగంలో 22 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అన్ని రంగాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయని, గతంలో ఉపాధి కోసం వలసలు పోయిన రాష్ట్రంలో వలసలు వచ్చే పరిస్థితికి చేరుకుందన్నారు. తొమ్మిదేండ్ల డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో వారానికి రెండు రోజులు పవర్ హాలీడే కొనసాగుతుందని, తెలంగాణలో మాత్రం కరెంటు పొమ్మన్నా పోయే పరిస్థితి లేదన్నారు. బీజేపీ గుడి, మసీదులతో రాజకీయ పబ్బం గడుపుతుందని, హడావుడి లేకుండా ఐదువందల ఏండ్లు గుర్తుండేలా యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని చేసిన ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు.
కర్ణాటకలో ప్రత్యామ్నాయం లేకనే కాంగ్రెస్ను గెలిపించారని, తెలంగాణలో బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని అన్నారు. దేశంలో ఒక పట్టణం మురికి నీరు మరో పట్టణం తాగిన దుస్థితి సూర్యాపేట పట్టణానిదని, ప్రస్తుతం కృష్షాజలాలు తాగుతూ ఆరోగ్యవంతమైన సమాజం జిల్లాలో ఏర్పడిందన్నారు. అనంతరం ఆటోనగర్ నిర్మాణంలో భూమి కోల్పోయిన పేదలకు న్యాయం చేస్తానని, అంతకంటే మంచి వ్యవసాయ భూమి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, సర్పంచ్ పాముల ఉపేందర్, ఎంపీటీసీ మామిడి కిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఎస్ఐఐసీ మేనేజర్ నాగరాజు, తాసీల్దార్ వెంకన్న, కార్మిక యూనియన్ల నాయకులు జానీపాషా, బాలకృష్ణ, కడారి వెంకన్న, నాగిరెడ్డి, భగవాన్, సలీం, వెంకన్న పాల్గొన్నారు.