స్వతంత్ర వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని వర్తమాననికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వామ్యం కావాలన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 8 నుండి 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా వజ్రోత్సవ సన్నాహాక సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
స్వాతంత్ర్య ఉద్యమ పోరాట ప్రాశస్త్యం, పోరాట యోధుల స్ఫూర్తి, అమరవీరుల అమరత్వం మూడో తరానికి అంతంత మాత్రంగానే తెలుసునని అటువంటి తరానికి స్వాతంత్ర్య ఉద్యమ ఫలితాల గురించి తెలియ జెప్పేందుకు ఇదొక సువర్ణావకాశమన్నారు. అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్యన్నీ సాధించిన మహాత్మాగాంధీ సంకల్పాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.పోరాటాలలో అహింసాయుత పోరాటామే ఎంతో కఠిన తరమైందని,అటువంటి పోరాటాన్ని ఎంచుకుని బారతదేశాన్ని విజయతీరాలకు చేర్చిన మహాత్మాగాంధీ గురించి వర్తమానానికి తప్పుడు సందేశం అందుతుందన్నారు.
అటువంటి అపోహలను పటాపంచలు చేయడంతో పాటు దేశానికి స్వాతంత్ర్యం సాదించేందుకు నాటి సమరయోధులు పడ్డ శ్రమను ఆ ఫలాలు అనుభవిస్తున్న నేటి తరానికి తెలియ చెప్పాలని ఆయన సూచించారు. నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఎటువంటి ప్రచార సాధనాలు లేని రోజుల్లోనే యావత్ భారతాన్ని ఏకదాటి మీదకు తీసుకొచ్చి సాధించిన స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను నేటి యువతకు తెలియ జెప్పే విదంగా కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈ నెల 9 న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపాలిటీలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఇంటింటికి త్రివర్ణ పతాకాన్ని అందిస్తారన్నారు.
ప్రతి ఇంటి మీద రెపరెపలాడే త్రివర్ణ పతాకం రూపంలో వర్తమాననికి స్వాతంత్ర్య పోరాట ఉద్యమ చరిత్ర బోధ పడేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ నెల 8న హైదరాబాద్ లో 9 నుండి జిల్లాల వారిగా కార్యక్రమాల రూపకల్పన జరిగిందన్నారు. 10న వన మహోత్సవం, 11న ఫ్రీడమ్ రన్, 12న జాతీయ సమైక్యతా రక్షా బంధన్, 13న అన్ని గ్రామపంచాయతీలలో ర్యాలీలు మూడు రంగుల బెలూన్ల ఎగరవేత, 14న జానపద కళాకారుల ప్రదర్శనలు, 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, 16న తెలంగాణ రాష్ట్ర సామూహిక ఆలాపన, 17న రక్తదాన శిబిరాలు, 18న జిల్లా స్థాయిలో ఉద్యోగులకు, యువతకు క్రీడా పోటీలు, 19న వయో వృద్ధులు, అనాధల ఆశ్రమాలలో స్వీట్లు, పండ్లు పంపిణీ, 20న రంగోలి, 21 చివరి రోజున జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ లతో గ్రామ పంచాయతీ/యుఎల్బిసిలలో ప్రత్యేక సమావేశాల నిర్వహణ ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.